బీహార్ ఎన్నికలు: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ, నితీషే సీఎం అభ్యర్థి
పాట్నా: త్వరలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ 27 మంది అభ్యర్థులతో తొలి జాబితాను మంగళవారం విడుదల చేసింది. అంతకుముందే జేడీయూ, బీజేపీల మధ్య సీట్ల పంపకాలు జరిగిన విషయం తెలిసిందే.
నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 122 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 121 స్థానాల్లో పోటీ చేయనుంది. బీహార్ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 243. మంగళవారం ఈ రెండు పార్టీల నాయకులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. నితీష్ కుమార్ ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.

నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని అంగీకరించినవారే ఎన్డీఏలో కొనసాగుతారని బీజేపీ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో నితీష్ కుమార్ తోపాటు బీజేపీ కీలక నేతలు పాల్గొన్నారు. బీజేీప జాతీయ ప్రధాన కార్యదర్శి, స్టేట్ ఇంఛార్జ్ భూపేంద్ర యాదవ్, ఎన్నికల ఇంఛార్జీ దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ఉన్నారు.
Bharatiya Janata Party releases the first list of 27 candidates for #BiharElections2020 pic.twitter.com/vxmymAEd8d
— ANI (@ANI) October 6, 2020
కాగా, జేడీయూకు కేటాయించిన సీట్లలోనే జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ అవామీ మోర్చాకు ఏడు సీట్లను పంచనున్నారు. బీజేపీ సీట్లలో వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీకి పంచనుంది.
త్వరలో ముగియనున్న 243 సీట్ల అసెంబ్లీలో ఆర్జేడీకి 73, జేడీయూకు 69, బీజేపీకి 54, కాంగ్రెస్ పార్టీకి 23, సీపీఐఎంల్ 3, ఎల్జేపీ 2, హెచ్ఏఎంకు 1, ఏఐఎంఐఎంకు 1 సభ్యులు ఉన్నారు. కాగా, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ.. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. నితీష్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన చిరాగ్.. రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని, కేంద్రంలో మాత్రం ఎన్డీఏతో కలిసి పనిచేస్తామని చెప్పింది.












Click it and Unblock the Notifications