నితీష్పై మొహం మొత్తినట్టే..మోడీ మంత్రమూ పనిచేయనట్టే: బిహారీల్లో రాజకీయ చైతన్యం: 63 శాతం
పాట్నా: బిహార్లో ఈ సారి ప్రభుత్వం మారడం ఖాయంగా కనిపిస్తోంది. తేజస్వి యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్ కూటమి వైపే గాలి బలంగా వీచినట్టు స్పష్టమౌతోంది. మూడు దఫాలుగా జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీకి కూటమికి అండగా నిలిచిన బిహారీయులు ఈ సారి ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్ కూటమి ఈ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నాయి. బిహార్కు కొత్త ముఖ్యమంత్రి రావడానికి దాదాపు ఖాయమని అభిప్రాయపడుతున్నాయి.
Today's Chanakya: నో హంగ్.. నో నితీష్: ఆర్జేడీ కూటమికే బిహార్: లాలూ కుమారుడికే పట్టం
63 శాతం మంది ఓటర్లు మార్పును కోరుకుంటున్నట్లు టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసింది. నితీష్ కుమార్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో మొహం మొత్తిందని, అందుకే ఆ జేడీయూ-బీజేపీ కూటమి ఓట్ల శాతం భారీగా క్షీణించిందని అంచనా వేసింది. ఆ కూటమి ఓటుబ్యాంకు 30 శాతం వరకు క్షీణించడానికి అవకాశం ఉన్నట్లు పేర్కంది. అదే సమయంలో 40 నుంచి 45 శాతం వరకు ఆర్జేడీ కూటమి ఓట్ల షేర్ పెరగొచ్చని వెల్లడించింది. ఫలితంగా- ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమికి 169-191 వరకు అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఎన్డీఏ కూటమికి 44 నుంచి 56 స్థానాలు మాత్రమే దక్కుతాయని పేర్కొంది.
బిహార్ జనాభాలో మొత్తం 63 శాతం మంది మార్పును కోరుకుంటున్నారని టుడేస్ చాణక్య పేర్కొంది. ఈ ఎన్నికల్లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయడానికి నిరుద్యోగం కారణమని 35 మంది ప్రజలు భావిస్తున్నట్లు వెల్లడించింది. నితీష్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని 28 శాతం, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని 19 శాతం మంది ప్రజలు భావిస్తున్నట్లు టుడేస్ చాణక్య తన ఎగ్జిట్ పోల్స్ ద్వారా స్పష్టం చేసింది. అటు నరేంద్ర మోడీ ఛరిష్మా గానీ, బీజేపికి ఉన్న ఓటుబ్యాంకు గానీ ఈ సారి ప్రభావం చూపలేదని తేలినట్టు పేర్కొంది.
ముస్లిం-యాదవ్ ఓటుబ్యాంకు ఈ సారి ఏకమొత్తంలో రాష్ట్రీయ జనతాదళ్కు బదలాయించినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. బిహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఈ రెండు సామాజిక వర్గాల కూడా ఈ సారి కూడబలుక్కుని ఆర్జేడీ-కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేశారని చెబుతున్నారు విశ్లేషకులు. ఫలితంగా- 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ఆర్జేడీ కూటమికి మూడొంతుల మేర మెజారిటీ లభిస్తుందని అంటున్నారు. అదే సమయంలో- బీజేపీకి లభించే స్థానాలు 60కి మించకపోవచ్చని అంటున్నారు. అలాగే చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన్శక్తి పార్టీ ప్రభావం చూపలేకపోయిందని చెబుతున్నారు.