నితీష్ కోపం, లొంగిన మనోరమ: హత్యకేసులో ట్విస్ట్లు
పాట్నా: హత్య కేసులో అరెస్టైన కుమారుడిని మూడు రోజుల పాటు దాచడంతో పాటు, ఇంట్లో విదేశీ మద్యం బాటిళ్లు ఉంచుకున్నారన్న ఆరోపణలపై బీహారులో సస్పెండైన మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి పోలీసులకు లొంగిపోయింది.
సోమవారం నాడు మీడియా సమావేశం సందర్భంగా... మీ పార్టీ వారే క్రిమినల్ కేసుల్లో ఎందుకు ఎక్కువగా ఇరుక్కుంటున్నారన్న ప్రశ్న.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఆపై గంటల వ్యవధిలోనే మనోరమ లొంగిపోవడం గమనార్హం.
కోర్టు ఎదుట లొంగిపోయిన ఆమెకు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధిస్తున్నట్టు జడ్జి తెలిపారు. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని కోర్టు వద్ద మనోరమ వాపోయారు. ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామని, ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేయనున్నామని పోలీసులు తెలిపారు. గత కొద్ది రోజులుగా మనోరమ అజ్ఞాతంలో ఉన్నారు.
ఇదే విషయాన్ని సోమవారం నితీశ్ కుమార్ను మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు అర్థం ఏంటి? అడగటంలో ఆంతర్యం ఏంటి? నేను ఆమెను దాచానా? లేక ఎవరైనా దాచారని మీ ఉద్దేశమా? ఆమె పోలీసులకు పట్టుబడలేదంటే నేనే కారణమా? నేను కూడా జైల్లో ఉండాలని మీరు అనుకుంటున్నారా? నేను ఎవరిపైనా జాలి చూపడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఆవేశంలో ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని మనోరమా దేవి తనయుడు రాఖీ యాదవ్ బలి తీసుకున్న విషయం తెలిసిందే. తన అధికారంతో హత్య చేసిన కన్న కొడుకును రక్షించాలని.. తల్లి మనోరమ, తండ్రి ప్రయత్నించారు. కానీ.. చట్టం ముందు వారి ఆటలు సాగలేదు.
పది రోజులుగా ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో తండ్రీకొడుకులను పోలీసులు అరెస్టు చేయగా, నిందితుడి తల్లి, బిహార్ ఎమ్మెల్సీ మనోరమ న్యాయస్థానంలో లొంగిపోయిన విషయం తెలిసిందే.

ఇదీ జరిగింది..
బిహార్ ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాఖీ యాదవ్ మే 7న స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్నాడు. మధ్యలో రాఖీ యాదవ్ ప్రయాణిస్తున్న కారును ఆదిత్య కుమార్ సచ్దేవ అనే యువకుడు ఓవర్ టేక్ చేశాడు. దీంతో ఆగ్రహించిన రాకీ.. సచ్దేవ కారును అడ్డగించాడు. మధ్యా ఘర్షణ జరిగింది. రాఖీ తన వద్ద ఉన్న తుపాకీతో సచ్దేవపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సచ్దేవ ప్రాణాలు కోల్పోయాడు. రాఖీ పరారయ్యాడు.
రాఖీని తప్పించేందుకు సాయం చేసిన అతడి తండ్రి బిందీ యాదవ్ను మే 8న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రాఖీ కోసం గాలించారు. మే 9న రాఖీ తల్లి, ఎమ్మెల్సీ మనోరమ ఇంటిని పోలీసులు సోదా చేశారు. మనోరమను విచారించారు. తొలుత తనకేం తెలియదని చెప్పింది. పోలీసులు గట్టిగా విచారించగా కొడుకు జాడను పోలీసులకు చెప్పింది.
మే 10న ఉదయం బోధ్గయలోని తండ్రి బిందీ యాదవ్కు చెందిన ఫ్యాక్టరీలో దాగి ఉన్న రాఖీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే మనోరమను విచారించే సమయంలో ఆమె ఇంట్లో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో మద్యంపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి, మనోరమపై అరెస్టు వారెంట్ జారీ చేశారు.
మరోవైపు మనోరమ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆమెను పదవి నుంచి సస్పెండ్ చేశారు. కుమారుడు అరెస్టయిన నాటి నుంచి ఎమ్మెల్సీ మనోరమ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాఖీ తప్పించుకోవడంలో సాయం చేయడంతో పాటు, మద్య నిషేధ చట్టాన్ని ఉల్లంఘించడంతో ఆమెపై కేసులు నమోదయ్యాయి. వారం తర్వాత మనోరమ కోర్టులో లొంగిపోయింది.












Click it and Unblock the Notifications