అనారోగ్యం: మందులు వేసుకోలేదని భార్యను చంపేసిన భర్త
పాట్నా: అనారోగ్యంతో బాధపడున్న తన భార్య డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోలేదన్న కోపంతో ఆమెను చంపేశాడు ఓ భర్త. ఈ ఘటన బీహార్లోని బక్సర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...
సల్మా ఖాతూన్ (26) అనే మహిళను ఆమె భర్త మహ్మద్ ముస్తఫా అబ్బాసీ పదునైన ఆయుధంతో కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆమె గురువారం మరణించింది. గత కొన్ని రోజులుగా సల్మా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో డాక్టర్లు ఆమెకు ఇచ్చిన మందులు వేసుకోవడం లేదని బరంపూర్ పోలీస్ స్టేషన్ అధికారి గోరఖ్ రామ్ తెలిపారు.
ఎన్నిసార్లు చెప్పినా ఆమె మందులు వేసుకోకపోవడంతో కోపం వచ్చిన ఆమె భర్త పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేసినట్లు చెప్పారు. రక్తమోడుతున్న తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా, ఆమె అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని సమీపంలో ఉన్న ఓ దర్గాకు వెళ్లి ప్రార్ధనలు చేశాడు.
సరైన సమయానికి ఆమెకు వైద్యం అందకపోవడంతో మరణించింది. సల్మా సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబ్బాసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అబ్బాసీని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.