కరోనా వ్యాక్సిన్పై అనూహ్య ప్రకటన -ఓట్లేస్తే ఉచితంగా ఇస్తామన్న బీజేపీ -చావు భయాన్ని అమ్ముతున్నారంటూ
కొవిడ్-19 విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరిన తరుణంలో, దేశ ప్రజలందరికీ దానిని పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి భరోసా ఇచ్చి 48 గంటలైనా తిరక్క ముందే బీజేపీ పార్టీ పరంగా చేసిన వాగ్దానం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కరోనా కాలంలో జరుగుతోన్న బీహార్ ఎన్నికల ప్రచారంలో ''బీజేపీ ఓట్లేస్తే బీహార్ ప్రజలకు ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్ అందజేస్తాం'' అంటూ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. విపత్తు కాలంలో ఓటర్లకు చావు భయాన్ని అమ్ముతున్నారంటూ బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.
Recommended Video

మేనిఫెస్టోలో తొలి హామీ ఇదే..
‘‘కొవిడ్-19కు సంబంధించి మూడు వ్యాక్సిన్లు కీలక దశలో ఉన్నాయి. ఒక్కసారి అవి ఉత్పత్తి దశకు చేరగానే.. బీహార్ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తా. రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే మా మొదటి హామీ'' అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గురువారం పాట్నాలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాటి ఎన్నికల ప్రచారంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. చైనా సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన బీహార్ రెజిమెంట్ జవాన్ల సాక్షిగా ఓట్లు అడగటం తెలిసిందే. నిర్మల తాజా వ్యాఖ్యలపై దాదాపు అన్ని పార్టీల నుంచి విమర్శలు రాగా, సోషల్ మీడియాలో సైతం సెటైర్లు పేలుతున్నాయి.

చావు భయాన్ని అమ్ముతున్నారు..
కరోనా విపత్తు కాలంలో ప్రజల భయాందోళనను క్యాష్ చేసుకోడానికి బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని, ఇది ముమ్మాటికీ మరణ భయాన్ని అమ్మడమేనని ప్రతిపక్ష ఆర్జేడీ విమర్శించింది. ‘‘త్వరలో అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్ దేశం సొత్తు అవుతుందే తప్ప.. బీజేపీది కానేకాదు. బీహార్ ఎన్నికల్లో చెప్పుకోడానికి ఏమీ లేదు కాబట్టే బీజేపీ ఉచిత వ్యాక్సిన్ ప్రకటన ద్వారా భయాన్ని అమ్మాలనుకుంటోంది. ఆత్మాభిమానం కలిగిన బీహారీలు తమ భవిష్యత్తును అమ్ముకోబోరనే సంగతి బీజేపీ తెలుసుకోవాలి'' అని ఆర్జేడీ మండిపడింది. బీహార్ లో బీజేపీ నేతలకు ముఖం లేదు కాబట్టే మేనిఫెస్టో విడుదల కోసం నిర్మలా సీతారామన్ ను తీసుకొచ్చుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేదని నేను ఆమెను ప్రశ్నిస్తున్నాను''అని ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ అన్నారు.

వ్యాక్సిన్ కూడా ప్యాకేజీ లాంటిదే..
‘‘బీహార్ ప్రజలకు ఉచితగా కొవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తామంటోన్న బీజేపీ.. దానికి అయ్యే ఖర్చును తమ పార్టీ ఖజానా నుంచి చెల్లిస్తుందా? ఒకవేళ ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించినట్లయితే.. అప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా ఉచితంగా ఇవ్వాలి కదా? కొవిడ్ భయాన్ని చూపించి, ఇంత నిస్సిగ్గుగా వ్యవహరించడం చాలా తప్పు'' అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది.. బీజేపీ ఉచిత వ్యాక్సిన్ వాగ్ధానాన్ని ఆర్థిక ప్యాకేజీతో పోల్చారు. ‘‘2015లో మోదీ బీహార్ కు 1.5లక్షల ప్యాకేజీ ప్రకటించారు. ఇప్పుడేమో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామంటున్నారు. ఈ రెండూ అమలుకాని వాగ్దానాలే''అని ప్రియాంక ఎద్దేవా చేశారు. ఈ తరహా ప్రకటన చేసినందుకు కేంద్ర మంత్రి నిర్మలపై, ఆమె పార్టీపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ డిమాండ్ చేశారు.

అబ్బే, బీహార్లో మాత్రమే ఉచితంగా..
ఎన్నికల మేనిఫెస్టోలో ‘ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తాం' అని బీజేపీ ప్రకటించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై బీజేపీ ఐటీ సెల్ ఇన్ చార్జి అమిత్ మాల్వియా స్పందించారు. ‘‘వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేంద్రం.. అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచుతుంది. ఆరోగ్య వ్యవహారాలు రాష్ట్రాల పరిధిలోకే వస్తాయి కాబట్టి వ్యాక్సిన్ ను ప్రజలకు ఎలా ఇస్తారనేది ఆయా ప్రభుత్వాల ఇష్టం. బీహార్ లో ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది రాష్ట్ర బీజేపీ నిర్ణయం. అంతే'' అని మాల్వియా వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications