బీహార్ రిజల్ట్స్ షాకింగ్-12 వేల ఓట్ల తేడాతో అధికారానికి మహాకూటమి దూరం- 0.03 శాతమే
హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 125 స్ధానాలు సాధించిన ఎన్డీయే అధికారం అందుకోగా.. దానికి తుదికంటా గట్టి పోటీ ఇచ్చిన మహాకూటమి మాత్రం 110 స్ధానాలకే పరిమితమైంది. ఇరు కూటముల మధ్య సీట్ల తేడా 15 స్ధానాలుగా కనిపిస్తున్నా ఓట్ల శాతంలో తేడా కేవలం 0.03 శాతమే కావడం విశేషం. అంటే అత్యంత స్వల్ప తేడాతో మహాకూటమి ఇక్కడ అధికారం కోల్పోయినట్లు తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారాన్ని నిలబెట్టుకున్నా వారికి తుదికంటా చెమటలు పట్టించిన ప్రత్యర్ధి మహాకూటమి నేత తేజస్వీ యాదవ్ బీహారీల మనసు గెల్చుకున్నారన్న అభిప్రాయానికి తాజా విశ్లేషణ బలం చేకూర్చేలా ఉంది.
ఎన్డీయే, మహాకూటమి మధ్య స్వల్ప తేడా..
బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఏ కూటమికీ స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వలేదు. కేవలం ప్రాంతీయ, వ్యక్తిగత అంశాల ఆధారంగానే జరిగిన ఈ పోరులో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పలు అంశాలను ఓటర్లు అస్సలు పట్టించుకోలేదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కరోనాపై పోరు వంటి అంశాలు ప్రభావం చూపుతాయని భావించినా అదేమీ జరగలేదు. దీంతో ఎన్నికల్లో గెలిచిన ఎన్డీయేకూ, ఓడిన మహాకూటమికీ మధ్య అత్యంత స్వల్ప వ్యత్యాసంతో ఓటర్ల ఆదరణ లభించినట్లు తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. అందుకే చివరి క్షణం వరకూ ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపినట్లు అర్ధమవుతోంది.
ఇరుకూటముల తేడా 0.03 శాతం ఓట్లే...
బీహార్లో జరిగిన హోరాహోరీ పోరులో విజయం సాధించిన ఎన్డీయే కంటే వారి ప్రత్యర్ధి మహాకూటమి కేవలం 0.03 శాతం ఓట్ల స్వల్ప తేడాతోనే వెనుకబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం ఎన్డీయేకు 37.26 శాతం ఓట్లు లభించగా... మహాకూటమికి 37.23 శాతం ఓట్లు వచ్చాయి. మిగతా పార్టీలన్నీ కలిపి 25.51 శాతం ఓట్లు సాధించాయి. అంటే ఈ పోరు ఎంత హోరాహోరీగా సాగిందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన ఏ ఎన్నికల్లోనూ విజేతలకూ, పరాజితులకూ మధ్య ఇంత తక్కువ ఓట్ల తేడా రాలేదు.
12768 ఓట్లతో అధికారం కోల్పోయిన మహాకూటమి..
బీహార్ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు ప్రధాన కూటముల్లో ఇరువురికీ దాదాపు సమానంగా ఓట్లు లభించినట్లు అన్ని విశ్లేషణలు చెబుతున్నాయి. మొత్తం పోలయిన 3.14 కోట్ల ఓట్లలో ఎన్డీయేకు కోటీ 57 లక్షల 1226 ఓట్లు రాగా.. మహాకూటమికి కోటీ 56 లక్షల 88 వేల 458 ఓట్లు వచ్చాయి. అంటే ఇరువురి మధ్య ఓట్ల తేడా కేవలం 12768 ఓట్లే. అంటే కేవలం 12 వేల ఓట్ల తేడాతో మహాకూటమి అధికారంలోకి ఆమడ దూరంలో నిలిచిపోయిందన్నమాట. ఇంత స్వల్ప తేడాతో ఈ మధ్య కాలంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కానీ కూటమి కానీ దేశంలోనే ఎక్కడా కనిపించడం లేదు. దీంతో మహాకూటమి నేతల ఆవేదన అంతా ఇంతా కాదు.
Recommended Video
విజేతల సగటు కన్నా తక్కువ ఓట్లతో మహాకూటమి ఓటమి...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 130 స్ధానాల్లో అభ్యర్ధులు సగటున 16825 ఓట్ల తేడాతో విజయాలు సాధించారు. కానీ ఎన్డీయేకూ, మహాకూటమికీ మధ్య ఓట్ల తేడా చూస్తే మాత్రం 12768. అంటే బీహార్లో మెజారిటీ స్ధానాల్లో విజేతల మార్జిన్ కంటే తక్కువ మార్జిన్తో మహాకూటమి మొత్తం అధికారానికి దూరమైందన్నమాట. ఈ లెక్కన చూస్తే బీహార్లో మహాకూటమి అభ్యర్ధులు ప్రతీ స్ధానంలోనూ కనీసం 53 ఓట్లు సాధిస్తే ఎన్డీయేను వెనక్కి నెట్టి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేదన్నమాట. ఐదేళ్ల క్రితం ఎన్డీయేపై మహాకూటమి సాధించిన ఏకపక్ష విజయంతో పోలిస్తే ఈసారి ఎన్డీయే సాధించిన విజయం అసలు లెక్కలోకే రాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.