బాలికలపై ఆకృత్యాలు: బీహార్ మంత్రి మంజూ రాజీనామా
పాట్నా: దేశ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేసిన ముజఫర్పూర్ షెల్టర్ హోం చిన్నారులపై జరిగిన ఆకృత్యాల ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ మంత్రి మంజూ వర్మ రాజీనామా చేశారు.
ఈ కేసులో ఆమె, ఆమె భర్త పాత్రపై ఆరోపణలు వచ్చిన క్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో భేటీ అనంతరం మంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న మంజూ వర్మ తెలిపారు.
ముజఫర్పూర్ షెల్టర్ హోం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, హోం నిర్వాహకుడు బ్రజేష్ ఠాకూర్తో మంజూ వర్మ భర్తకు సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చేపట్టిన సామాజిక ఆడిట్లో షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు వెలుగులోకి వచ్చాయి.
హోంలో ఆశ్రయం పొందుతున్న 40మంది బాలికల్లో సగానికి పైగా బాలికలపై లైంగిక దాడులు జరిగినట్లు వైద్య నివేదికల్లో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, షెల్టర్ హోంను బీహార్ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. బాలికలను ఇతర జిల్లాల్లోని వసతి గృహాలకు తరలించి షెల్టర్ హోంను అధికారులు సీజ్ చేశారు.