బిచ్చమెత్తి మరీ మరుగుదొడ్డి కట్టించిన మహిళ!
పాట్నా: స్వచ్ఛభారత్ అంటూ పరిసరాల పరిశుభ్రతపై ఉపన్యాసాలు దంచడం, టీవీలో యాడ్లు ఇవ్వడం రాజకీయ నాయకులు, ప్రభుత్వాలకు మామూలే. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం నిధులుండవు.. ఉన్నా అవి పేదల వరకు రావు. మరుగుదొడ్ల పేరిట విడుదలయ్యే నిధులన్నీ ఏమౌతున్నాయో జగమెరిగిన సత్యం.
కానీ బీహార్లో ఓ మహిళ చేసిన పని ఇటు కుహనా రాజకీయ నాయకులకు, అటు అమ్యామ్యాలు బొక్కే అధికారులకు చెంపపెట్టుగా మారింది. నిలువెల్లా నిర్లక్ష్యంతో అధికారులు పట్టించుకోకపోయినా సంకల్పం ఉండాలేగానీ సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించిందా మహిళ.

బీహార్లోని పత్రా ఉత్తర్కి చెందిన అమినా ఖాతూన్ అనే మహిళ భర్త చనిపోయాడు. కూలి పనులు చేసుకుంటూ ఆమె జీవనం సాగిస్తోంది. మరుగుదొడ్డి కోసం అధికారులకు దరఖాస్తు పెట్టుకుంది. రోజూ ఆఫీసు చుట్టూ తిరిగింది. అయినా అధికారులు స్పందించలేదు.
ఎలాగైనా మరుగుదొడ్డి నిర్మించి తీరాలని భావించిందామె. సమీప గ్రామాల్లో బిచ్చమొత్తుకొని... పైసా పైసా కూడబెట్టింది. మరుగుదొడ్డి నిర్మాణానికి సరిపడా డబ్బులు వచ్చాక... స్వగ్రామంలో పనిమొదలు పెట్టింది. ఎట్టకేలకు మరుగుదొడ్డిని నిర్మాణాన్ని పూర్తి చేసింది.
ఖాతూన్ పట్టుదల గురించి తెలిసిన తాపీ మేస్త్రి, కూలీలు కూడా ఆమెకు మరుగుదొడ్డి నిర్మాణంలో చేతనైనంత సహాయం చేశారు. వారు ఆమెనుంచి కూలి డబ్బులు కూడా తీసుకోలేదు. ఉచితంగా మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న అధికారులు సిగ్గుతో కుచించుకుపోయారు. ఉన్నతాధికారులు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ప్రయత్నాన్ని వారు అభినందించి సత్కరించారు.
తాను బ్లాక్ స్థాయి అధికారుల వద్దకెళ్లి మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు ఇప్పించవలసిందిగా దరఖాస్తు చేసుకున్నానని, కానీ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో గత్యంతరం లేక డబ్బు సమకూర్చుకోవడానికి చుట్టుపక్కల గ్రామాలకెళ్లి బిచ్చమెత్తుకున్నానని అమినా ఖాతూన్ పేర్కొంది.












Click it and Unblock the Notifications