బర్డ్ ఫ్లూ విలయం: చికెన్, గుడ్లు తింటున్నారా? -అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు
దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ బారినపడి వేల సంఖ్యలో పక్షులు చనిపోతుండటం, కేసుల సంఖ్య గంటగంటకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు రాష్ట్రాల్లో చనిపోయిన పక్షుల్లో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ ఉందని నిర్ధారించిన కేంద్రం.. వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు బుధవారం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు, చికెన్, గుడ్లు తినడంపై కేంద్ర మంత్రులు కీలక సూచనలు చేశారు..
Recommended Video
అఖిలప్రియ అరెస్టులో సంచలన ట్విస్ట్ -కిడ్నాప్ కేసులో ఏ1గా సుబ్బారెడ్డి -జగన్ సర్కారు సాయంతో..
తక్షణమే చర్యలు తీసుకోండి..
బర్డ్ ఫ్ల్యూ బారినపడి చనిపోయిన వాటిలో స్థానిక అటవీ జీవులతోపాటు వలసపక్షులు కూడా ఉన్నాయి. వాటి నమూనాలను ఐసీఏఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీసెస్, భోపాల్ లో పరీక్షించగా.. హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ గా ఉన్నట్లు నిర్ధరణ అయిందని కేంద్ర పాడి పశుసంవర్థకశాఖ తెలిపింది. ఈ వైరస్ పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశం ఉంది కాబట్టి.. అలా జరగకముందే అన్ని రాష్ట్రాలు తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.
పక్షులపై నిఘా పెంచండి..
హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో పక్షులు మృత్యువాతపడ్డాయి. అన్ని రకాల పక్షులపై పూర్తి స్థాయిలో పెంచాలని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే అరికట్టేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా సూచనలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడాలని కేంద్రం కోరింది. ఫ్లూ నివారణ చర్యలు, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర పాడి పశుసంవర్థకశాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు..
బర్డ్ ఫ్లూ మనకు కొత్తేమీ కాదు..
పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వస్తుండటంతో కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయగా, సంబంధిత శాఖల కేంద్ర మంత్రులు సైతం పరిస్థితిపై స్పందిస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు ఐదు రాష్ట్రాల్లో మాత్రమే బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని కేంద్ర వ్యవసాయ, ఫుడ్ ప్రోసెసింగ్ శాఖ సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్ తెలిపారు. బర్డ్ ఫ్లూ అనేది ఇండియాకు కొత్తేమీ కాదని, 2015 నుంచి ప్రతి శీతాకాలంలో బర్డ్ ఫ్లూ కేసులు దేశంలో నమోదవుతూనే ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అంతేకాదు..
పౌల్ట్రీలకూ పాకిన వైరస్..
మన దేశంలో తొలుత వలస పక్షులు, ఆ తర్వాత వణ్యప్రాణుల్లో బర్డ్ ఫ్లూ బయటపడగా ఇప్పుడదని మాసం కోసమే పక్షులను పెంచే పౌల్ట్రీలకు కూడా వ్యాపించినట్లు కేంద్ర మంత్రి బల్యాన్ తెలిపారు. అయితే ఈ పరిస్థితి చాలా స్వల్పమైనదని, కేవలం కేరళ, హర్యానాలో మాత్రమే పౌల్ట్రీలలో ఈ కేసులు నమోదయ్యాయి. కేరళలో ఒక బాతులో, హర్యానాలో ఒక పౌల్ట్రీలో వైరస్ బయటపడిందని మంత్రి వివరించారు. ఇంతవరకూ బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాప్తి చెందినట్టు ఎలాంటి కేసు ఇండియాలో నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, చనిపోయిన పక్షలను సరిగా డిస్పోజ్ చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించినట్లు బల్యాన్ తెలిపారు. ఇక..
చికెన్, గుడ్లు తింటున్నారా?
బర్డ్ ఫ్లూ కారణంగా గడిచిన 10 రోజులుగా దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పక్షులు మరణించాయి. అయితే వాటిలో ఎక్కువగా వలస పక్షులే ఉండటం గమనార్హం. పౌల్ట్రీలలో, ఇళ్లలో పెంచుకునే పక్షులకు వైరస్ సోకిన అనవాళ్లు కేవలం రెండు రాష్ట్రాల్లోనే, అది కూడా రెండు పక్షుల్లో మాత్రమే గుర్తించారు. 2015 మాదిరిగానే ఇప్పుడు కూడా బర్డ్ ఫ్లూ కలకలం మొదలైన వెంటనే ప్రజలంతా చికెన్, గుడ్లు తినడానికి భయపడుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. కాగా, వాటిని తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అభయమిచ్చారు. ''చికెన్, గుడ్లు వండుకునేటప్పుడు వాటిని పూర్తిగా ఉడకనిస్తే చాలు. వాటిని తినడం వల్ల ఎవరికి ఎలాంటి హాని ఏర్పడదు. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం రాష్ట్రాలను ఇప్పటికే అలెర్ట్ చేశాం'' అని మంత్రి గిరిరాజ్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటన చేశారు.
డాలి నానికి బాలకృష్ణ వార్నింగ్.. నోరు అదుపులో పెట్టుకో -మాట వినకుంటే ఇక చేతలే..