జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు: పొత్తులు లేవంటున్న పార్టీలు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, అధికార నేషనల్ కాంగ్రెస్, పీడీపీ, జేకేఎన్పీపీ, ఎన్సీపీ, బీఎస్పీ ఒంటరి పోరుకే ఆసక్తిని కనబరుస్తున్నాయని సమాచారం. ఇప్పటికే బీజేపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ ఇన్చార్జ్ అవినాష్ రాయ్ ఖన్నా ప్రకటించారు.
జమ్మూ కాశ్మీర్లో మొత్తం 87 అసెంబ్లీ స్ధానాలకు గాను ఐదు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి దశ ఎన్నికలకు మంగళవారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో ఏ పార్టీలు కూడా మేనిఫెస్టోలు, అభ్యర్ధుల జాబితాను విడుదల చేయలేదు. అధికార నేషనల్ కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటి వరకు పొత్తుపై వెల్లడించలేదు.
ఇక బీఎస్పీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ తులసీ దాస్ లాంగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని తెలిపారు. ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీకి దిగుతామని ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఠాకూర్ రణ్ ధీర్ సింగ్ పేర్కొన్నారు.
రెండవ దశ డిసెంబర్ 2న, డిసెంబర్ 9న మూడో దశ, డిసెంబర్ 14న నాలుగో దశ, 20న ఐదో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. జమ్ము కాశ్మీర్-లో మొత్తం 87 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో ‘నోటా' ఓటు కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 23న ఉంటుంది. జమ్ము కాశ్మీర్-లో 10,015 పోలింగ్ బూత్-లు, జార్ఖండ్-లో 24,648 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.