లాక్డౌన్ వేళ.. బీజేపీ సీనియర్ నాయకుడి గ్రాండ్ బర్త్డే ఫంక్షన్.. నో సోషల్ డిస్టెన్సింగ్..!
బెంగళూరు: వేలాదిమంది ప్రాణాలను హరించి వేస్తోన్న భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న వేళ.. భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడొకరు తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం వివాదాలను రేకెత్తిస్తోంది. లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. తన అభిమానులతో కలిసి ఆయన గ్రాండ్గా బర్త్డే ఫంక్షన్ చేసుకున్నారు. కేక్ను కట్ చేసి, ఒకరినొకరు తినిపించుకున్నారు.
బెంగళూరులోని జక్కూరు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బీజేపీ నాయకుడి పేరు కేఎ మునీంద్ర కుమార్. జక్కూర్ వార్డు కార్పొరేటర్. జక్కూర్ వార్డు నంబర్ 5 కౌన్సిలర్గా ఆయన ఎన్నికయ్యారు. ఆయన పుట్టినరోజు వేడుకలను ఆయన తన అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకొన్నారు. జక్కూరులో ప్రత్యేకంగా షామియానాలను వేసి, మరీ ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకున్నారు. భారీ కేక్ను కట్ చేసి అభిమానులకు తినిపించారు.
ఒకవంక లాక్డౌన్ కొనసాగుతున్నా.. దాన్ని పట్టించుకోలేదు. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నానాతంటాలు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని రాజకీయంగా మరింత ఇరుకున పెట్టేలా ఆయన వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన బీజేపీ నాయకులు సైతం ఆయన చర్యలు తప్పుపడుతున్నారు. లాక్డౌన్ అమలులో ఉన్న ఈ సమయంలో మునీంద్రకుమార్ వైఖరి సరి కాదని, ఆయన సంయమనాన్ని పాటించి ఉంటే బాగుండేదని అంటున్నారు.