సర్వే: యుపి, బీహార్ల్లో బిజెపి హవా, సగానికిపైగా
న్యూఢిల్లీ: బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపి గాలి వీచే అవకాశాలున్నాయి. ఓ టీవి చానెల్ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లోని 120 స్థానాల్లో బిజెపి 61 స్థానాలు గెలుచుకుంటుందని, తద్వారా అది అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆ సర్వే తేల్చింది.
ఎబిపి న్యూస్ - నీల్సన్ సర్వే బిజెపికి పెద్ద బలాన్ని ఇస్తోంది. ఢిల్లీలో అధికారంలోకి రావాలంటే ఉత్తరాదిన ఉన్న ఆ రెండు రాష్ట్రాలు కీలకమవుతాయి. యుపిలో బిజెపి పరిస్థితి మెరుగైనట్లు సర్వేలో తేలింది. 80 సీట్లలో బిజెపి 40 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. నెల క్రితం జరిగిన సర్వేలో బిజెపి 35 సీట్లు గెలుస్తుందని తేలింది. దీన్ని బట్టి యుపిలో బిజెపి బలం పుంజుకుంటున్నట్లు అర్థమవుతోంది.
బీహార్లో బిజెపి హవా కాస్తా తగ్గినట్లు అర్థమవుతోంది. ఈ రాష్ట్రంలో 21 సీట్లు గెలుచకుంటుందని సర్వే తేల్చింది. జనవరిలో నిర్వహించిన సర్వేలు బిజెపికి 24 సీట్లు వస్తాయని తేలింది. కాంగ్రెసు పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జెడితో, రాంవిలాస్ పాశ్వాన్ ఎల్జిపితో పొత్తు పెట్టుకుంటే బిజెపికి వచ్చే సీట్ల సంఖ్య 16కు తగ్గుతాయి.
బిజెపి యుపిలో మిగతా ప్రధాన పార్టీలను పక్కకు తోస్తూ ముందుకు దూసుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెసు - ఆర్ఎల్డి కూటమి 2009లో 26 సీట్లు గెలవగా ఈసారి 11 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. ఎస్పీ బలం 23 నుంచి 14కు తగ్గుతుందని సర్వే తేల్చింది. బిఎస్పీ ఎంపీలు 20 నుంచి 13కు తగ్గుతారని అంచనా వేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు గెలుచకుంటుందని సర్వేలో తేల్చారు.