కర్ణాటక పాఠశాలల్లో భగవద్గీత: నైతిక శాస్త్రం పేరుతో: హిజబ్ నిషేధం సక్సెస్తో..
బెంగళూరు: ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీతను ఓ ప్రత్యేక సబ్జెక్టుగా బోధించబోతున్నామని గుజరాత్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది. ప్రాథమిక విద్య దశ నుంచే విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వేదాల్లోని సారాంశం, విజ్ఞానం పట్ల అవగాహన కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు భగవద్గీతను బోధిస్తామంటూ గుజరాత్ విద్యా శాఖ మంత్రి జీతూ వాఘానీ వెల్లడించారు.
ఇప్పుడు తాజాగా కర్ణాటక కూడా అదే రకమైన ప్రణాళికలను రూపొందించుకుంది. పాఠశాలల్లో భగవద్గీతను ఓ ప్రత్యేక సబ్జెక్ట్గా బోధించడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ తెలిపారు. నైతిక శాస్త్రంగా భగవద్గీతను బోధిస్తామని చెప్పారు. దీనిపై నిపుణుల నుంచి సలహాలను తీసుకుంటున్నామని వివరించారు. వారి నుంచి సిఫారసులు అందగానే.. ఈ దిశగా ఉత్తర్వులను జారీ చేయాలని భావిస్తున్నామని అన్నారు.
భగవద్గీత హిందువులకు మాత్రమే చెందినది కాదని, అందరికీ వర్తిస్తుందని అన్నారు. నిఫుణుల అంగీకారంతో దీనిని స్కూల్ సిలబస్లో ప్రవేశపెడతామని చెప్పారు. త్వరలోనే నిపుణులు తమ సిఫారసులను అందజేస్తారని అన్నారు. ఇదివరకు పాఠశాలల్లో మోరల్ సైన్స్ను బోధించే వారని, ఇప్పుడా విద్యా విధానం లేదని వ్యాఖ్యానించారు. సమాజంలో ప్రతి ఒక్కరి పట్ల ఎలా నడుచుకోవాలో నేర్పించే నైతిక శాస్త్రాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
నైతిక శాస్త్రాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని చాలామంది తల్లిదండ్రులు విద్యా శాఖ అధికారులను కోరుతున్నారని మంత్రి బీసీ నగేష్ చెప్పారు. భవిష్యత్తులో తప్పకుండా నైతిక విద్యను ప్రవేశపడతామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశ పెట్టడంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
భగవద్గీత, రామాయణం, మహాభారతంలో పిల్లలపై ఏది సానుకూల ప్రభావాన్ని చూపుతుందో దానినే సిలబస్లో ప్రవేశపెడతామని అన్నారు. కాగా- మొన్నటిదాకా పాఠశాలలు, కళాశాలల్లో హిజబ్లను నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. నిషేధాన్ని తొలగించాలంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్లపై విచారణ అనంతరం హైకోర్టు వాటిని కొట్టేసింది.