అబ్బే..!! కర్ణాటక రాజకీయ అస్థిరతలో మా పాత్రేం లేదు.. లోక్సభలో రాజ్నాథ్
న్యూఢిల్లీ : కర్ణాటక ప్రభుత్వ అస్థిరతకు బీజేపీ కారణమని లోక్సభలో విపక్ష సభ్యలు నినాదాలు హోరెత్తాయి. సభలో పలుమార్లు అడ్డుకొని, స్పీకర్ చైర్ వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. బీజేపీ వల్లే కర్ణాటక ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని విపక్ష కాంగ్రెస్, జేడీఎస్ ఎంపీలు ఆరోపించారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి బీజేపీ కుటీల రాజకీయం కారణమనే నినాదాలు పెక్కుటిల్లాయి. దీంతో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కల్పించుకున్నారు. విపక్ష సభ్యుల ఆరోపణలను తోసిపుచ్చారు.
మాటలు-మంటలు
కర్ణాటక రాజకీయ రసకందాయంపై లోక్సభలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశఫెట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించింది. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తుందని మండిపడింది. సభ్యుల ఆరోపణలపై రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. కర్ణాటక రాజకీయ పరిస్థితులకు కేంద్రానికి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే .. నేరాన్ని మా వైపే వేస్తారా అని ఎదురు ప్రశ్నించారు. విపక్ష సభ్యుల ఆరోపణలు పసలేనివని కొట్టిపారేశారు.
ఇది సరికాదు
మరోవైపు కేంద్రప్రభుత్వాన్ని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తప్పుపట్టారు. బీజేపీ ఎప్పుడూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుందని ఆరోపించారు. కర్ణాటకే కాదు పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పార్టీ అవలంభించిన వైఖరి సరికాదన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి సంపూర్ణ మద్దతివ్వలేదని గుర్తుచేశారు. ఆ పార్టీ అధికారానికి దూరంలో నిలువడంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరిందన్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు కామనేనని స్పష్టంచేశారు. ఇదివరకు కేటాయించిన పోర్టుపోలియాలు మారుస్తామని పేర్కొన్నారు.
క్యాంపు రాజకీయాలు
కర్ణాటకలో రాజకీయ సంక్షోభంతో .. తన పార్టీ ఎమ్మెల్యేలతో క్యాంపు వేయాలని సీఎం కుమారస్వామి నిర్ణయించారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలతో సీఎం సమవేశమయ్యాకే స్పష్టత రానుంది. ఎమ్మెల్యేలను మాత్రం మడికేరిలోని కూర్గ్కు తరలించాలని జేడీఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చోట అయితే సురక్షితమని ఆ పార్టీ భావిస్తోంది. దానికితోడు బెంగళూరుకు 265 కిలోమీటర్ల దూరం కూడా ఉండటం మరో కారణమని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. పరిస్థితి సద్దుమణిగాక .. వారిని మెల్లగా బెంగళూరు తరలించాలని జేడీఎస్ వర్గాలు భావిస్తున్నాయి.