జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు, బీజేపీ హవా, బహిష్కరణ, ఇండిపెండెట్స్ కింగ్ మేకర్స్!
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత మొదటి సారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్నికల్లో పార్టీలను పక్కన పెట్టి స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు మొదటి స్థానంలో, బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. 1947 తరువాత జమ్మూ కాశ్మీర్ లో మొదటి సారి జరిగిన బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (BDC) ఎన్నికలు అక్టోబర్ 24వ తేదీ జరిగాయి. బీడీసీఎన్నికల్లో 98 శాతం ఓటింగ్ జరిగింది. ఈ బీడీసీ ఎన్నికల్లో ఇండిపెండెట్స్ కింగ్ మేకర్స్ గా నిలిచారు.
ఇండిపెండెట్స్ హవా
310 నియోజక వర్గాల్లో బీడీసీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 1,092 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. బీడీసీ ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టి సుమారు వెయ్యి మంది స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 217 మంది స్వతంత్ర పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ 81 స్థానాల్లో విజయం సాధించింది.
98 శాతం పోలింగ్
జమ్మూ కాశ్మీర్ లో పంచాయితీ రాజ్ సంస్థల్లో గ్రామ, బ్లాక్ డెవలప్ మెంట్, జిల్లా అంటూ మూడు విభాగాల్లో ఎన్నికలు జరిగాయి. 1947 తరువాత బీడీసీ ఎన్నికలు జరగనేలేదు. అయితే ఇప్పుడు జరిగిన బీడీసీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 98 శాతం పోలింగ్ జరిగింది. 18,316 మంది పురుషులు, 8,313 మంది మహిళలుతో సహ మొత్తం 26,629 మంది ఓట్లు వేశారు. బీడీసీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 98 శాతం పోలింగ్ జరిగింది.
ప్రముఖ పార్టీల బహిష్కరణ
బీడీసీ ఎన్నికలను ప్రముఖ రాజకీయ పార్టీలు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫ్ రెన్స్ పార్టీ, జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీలు బహిష్కరించాయి. .ఆర్టికల్ 370 రద్దు చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికలను బహిష్కరించాయి. అయితే పూల్వామాలో ఒక్కచోట మాత్రమే కాంగ్రెస్ పోటీ చేసింది.
ప్రజా ప్రభుత్వం మీద నమ్మకం: మోడీ
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన బీడీసీ ఎన్నికల్లో ప్రజల ఉత్సాహం చూస్తుంటే ప్రజా ప్రభుత్వం మీద వారు ఎంతో నమ్మకం పెట్టుకున్నట్లు కనిపించిందని, వారికి ధన్యవాదాలు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జమ్మూ, కాశ్మీర్, లేహ్, లడాక్ లో చాలా శాంతియుతంగా బీడీసీ ఎన్నికలు జరిగాయని, ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారని, వారికి ధన్యవాదాలు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
ఆ నాయకులు ఏకగ్రీవం
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన బీడీసీ ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా జరగడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 290 బ్లాక్ లో బీడీసీ ఎన్నికలు జరిగాయి. 27 చోట్ల ప్రత్యర్థులు పోటీ లేకపోవడంతో ఆక్కడి నాయకులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత జరగిన ఎన్నికలు ప్రశాతంగా ముగిసిపోవడంతో ప్రజలతో పాటు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.