టిపై క్లియర్: పొత్తులపై బాబుకు బిజెపి జవదేకర్ ఝలక్
హైదరాబాద్: పొత్తులపై తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఝలక్ ఇచ్చారు. ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. పొత్తులపై తాము ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ఎన్నికల తేదీల ప్రకటన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బిజెపి, టిడిపి మధ్య పొత్తు పొడుస్తోందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై జవదేకర్ స్పందించారు.
మీడియాలో బిజెపి పొత్తులపై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తెలంగాణపై తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు బిజెపి కట్టుబడి ఉందన్నారు. అయితే సీమాంధ్రలోని ఆందోళనలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర విభజన జరగాలని, సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సొంత పార్టీ పార్లమెంటు సభ్యులే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వారి పైన కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.
ఫిబ్రవరిలోపు జరిగే తుది సమావేశాల్లోగా తెలంగాణ బిల్లు తీసుకు వచ్చేది అనుమానమే అన్నారు. లోక్పాల్ బిల్లు, మహిళా బిల్లుల అనుభవం నేపథ్యంలో తెలంగాణ బిల్లుపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. దీనికి కాంగ్రెసు వైఖరే ప్రదాన కారణమన్నారు. తెలంగాణపై తమ పార్టీ మాత్రం మొదటి నుండి స్పష్టతతో ఉందన్నారు.
ప్రకాశ్ జవదేకర్ హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు సిహెచ్ విద్యాసాగర రావు, బండారు దత్తాత్రేయ, నాగం జనార్ధన్ రెడ్డి తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.