అవినీతి సీఎం ముందు మోకరిల్లారు -బీజేపీపై చిరాగ్ పాశ్వాన్ ఫైర్ -నితీశ్కు ఒక్క ఓటూ పడదంటూ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం ఆదివారంతో ముగియనుండటంతో అన్ని పార్టీలూ ప్రచార జోరును పెంచాయి. కేంద్రంలోని ఎన్డీఏలో కొనసాగుతూ.. బీహార్ లో మాత్రం ఎన్డీఏకు వ్యతిరేకంగా బరిలోకి దిగిన ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తాజాగా బీజేపీపైనా విమర్శలు సంధించారు. ఇన్నాళ్లూ జేడీయూ చీఫ్, సీఎం నితీశ్ కుమార్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన చిరాగ్ తొలిసారి బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు.. సీఎం నితీశ్ కుమార్కు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంపై ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మండిపడ్డారు. అవినీతిపరుడైన ముఖ్యమంత్రి (నితీశ్) ముందు బీజేపీ నేతలు ఎందుకు మోకరిల్లుతున్నారని ప్రశ్నించారు. నితీశ్ ను ప్రశంసిస్తూ బీజేపీ నేతలు చేస్తోన్న ప్రకటనల వల్ల ఆ పార్టీ(బీజేపీ) కార్యకర్తలు, అభిమానులు నొచ్చుకుంటున్నారని అన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి జేడీయూ కంటే ఎక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి అయ్యేది నితీశేనని జేపీ నడ్డా ప్రకటించడంపై చిరాగ్ పాశ్వాన్ ఆదివారం స్పందిస్తూ ఈ కామెంట్లు చేశారు. ''ఈ ఎన్నికల్లో నితీశ్ ముఖం చేసి ఒక్కరు కూడా ఓటేయరు. కాబట్టే ప్రధాని మోదీ పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. తాను గెలవబోనన్న సంగతి నితీశ్ కు కచ్చితంగా తెలుసు. అలాంటి అవినీతి ముఖ్యమంత్రి ముందు బీజేపీ నేతలు మోకరిల్లడం పార్టీ శ్రేణుల్ని బాధకు గురిచేస్తున్నది'' అని చిరాగ్ వ్యాఖ్యానించారు.
243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గతవారం(అక్టోబర్ 28న) తొలి దశ పోలింగ్ ముగియగా, మంగళవారం(నవంబర్ 3న) రెండో దశ పోలింగ్ జరుగనుంది. రెండో దశ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగియనుంది. నవంబర్ 7న మూడో దశ పోలింగ్ తో బీహార్ ఎన్నికలు ముగుస్తాయి. ఈ నెల 10న ఫలితాలు వెలువడతాయి.