బీజేపీ మాస్టర్ ప్లాన్: బళ్లారి ఎంపీ శ్రీరాములు ఉప ముఖ్యమంత్రి, లింగాయత, దళితుల పవర్ !
బెంగళూరు: కర్ణాటకలోని బీజేపీ నాయకులకు ఇంత కాలానికి దళితులు, ఎస్టీల ఓట్ల విలువ తెలిసింది. ఎస్టీల నాయకుడు, బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములును కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని చెయ్యాలని బీజేపీ నాయకులు దాదాపు తీర్మానించారు. దళితులు, ఎస్టీల ఓట్లు బీజేపీకి రావాలంటే శ్రీరాములుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. అగ్రవర్ణాల పార్టీ అనే అపవాదు నుంచి బయటపడాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవి లెక్కలు
కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు అయిన దళితుల ఓట్లు సంపాధించాలని బీజేపీ 10 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటక జనాబా 6.5 కోట్లు. అందులో దళితుల ఓటు బ్యాంకు దాదాపు 25 శాతం ఉంది. దళితులు, ఎస్టీల ఓట్లుకు గాలం వేసి కచ్చితంగా అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ వేస్తోంది.
మూడు పార్టీలు పోటాపోటీ
శాసన సభ ఎన్నికల్లో దళితుల ఓట్లు సంపాధించాలని అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షాలు బీజేపీ, జేడీఎస్ పార్టీలు పలుప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే బీఎస్పీతో పొత్తుపెట్టుకున్న జేడీఎస్ దళితుల ఓట్లు తమకు అనుకూలంగా పడతాయని భావిస్తోంది.
తెర మీదకు శ్రీరాములు
లింగాయత వర్గానికి చెందిన బీఎస్. యడ్యూరప్పను బీజేపీ ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. లింగాయత ఓట్లు బీజేపీకి పడతాయని నాయకులు భావిస్తున్నారు. ఇక శ్రీరాములును ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే దళితులు, ఎస్టీల ఓట్లు మనకే వస్తాయని బీజేపీ నాయకులు అంచనాలు వేస్తున్నారు.
బళ్లారి కాదు చిత్రదుర్గ
బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములుకు చిత్రదుర్గాలోని మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని అధిష్టానం ఆదేశించింది. ఎస్టీ రిజర్వేషన్ అయిన మాళకాల్మూరు నియోజక వర్గంలో వాల్మీకిల ఓట్లు అధిక శాతం ఉన్నాయి. వాల్మీకిలలో అత్యంత శక్తివంతమైన నాయకుడు అయిన శ్రీరాములను ఇక్కడ బరిలో దింపి ఆ సీటు కైవసం చేసుకోవడానికి పావులుకదుపుతున్నారు.
30 నియోజక వర్గాలు టార్గెట్
వాల్మీకిలు ఎక్కువగా ఉన్న 30 నియోజక వర్గాల్లో లింగాయత ఓట్లు కలుపుకుని విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వాల్మీకి వర్గం నాయకుడు బి. శ్రీరాములకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిందని తెలిసింది. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా తాను శక్తివంచన లేకుండా నిర్వహిస్తానని, యడ్యూరప్పను ముఖ్యమంత్రి చెయ్యడం మా బాధ్యత అని బీజేపీ ఎంపీ. శ్రీరాములు అంటున్నారు.
కాంగ్రెస్ కు చెక్
దళితులను ముఖ్యమంత్రి చేస్తామని 2013 శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించింది. అయితే సిద్దరామయ్యను సీఎం చేసింది. డాక్టర్ జీ. పరమేశ్వర్ ను ఉప ముఖ్యమంత్రి చేస్తారని అనుకుంటే అందుకు సిద్దరామయ్య అంగీకరించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక మల్లికార్జున ఖార్గేని ఢిల్లీకి పంపించి చేతులుదులుపుకున్నారు. ఇప్పుడు ఎస్టీ వర్గానికి చెందిన బి. శ్రీరాములను ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చెయ్యవచ్చని బీజేపీ ఆలోచిస్తోంది.