బాబుకు 'బీజేపీ' తలనొప్పి తప్పదా? కేసీఆర్కు ధీటుగా..
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి భారతీయ జనతా పార్టీ చాపకింద నీరులా వస్తోందని, ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇబ్బందికర పరిణామమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా, సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం, ఇటీవల మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల గెలుపు నేపథ్యంలో బీజేపీ ఊపు మీద ఉంది.
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుండి బీజేపీ ఆయా రాష్ట్రాల పైన దృష్టి సారించింది. ఎన్నికలు జరిగే, తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న రాష్ట్రాల పైన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి సారించారు. పార్టీ బలోపేతం కోసం లేదా బలంగా ఉందని భావించిన సమయాల్లో మిత్రుత్వం ఉన్న పార్టీలకు కూడా షా ఝలకిస్తున్నారు.
ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ చిన్న చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసింది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మైత్రి రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడ తమ బలం పెరిగిందని భావించిన బీజేపీ, ఇటీవలి ఎన్నికల్లో ఎక్కువ సీట్లను ఆశించింది. తాము కోరినన్ని సీట్లకు శివసేన నో చెప్పడంతో బీజేపీ విడిపోయి పోటీ చేసింది.
అయితే, బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకే ఎక్కువ సీట్ల పేరుతో బయటకు వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతోంది. అనంతరం అమిత్ షా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల పైన దృష్టి సారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాలలో ఎన్డీయే కూటమి మిత్రులు (అధికార పార్టీ) లేరు. కానీ, ఏపీ విషయానికి వచ్చేసరికి టీడీపీకి భవిష్యత్తులో శివసేనకు తగిలిన దెబ్బనే తగులుతుందా అనే చర్చ సాగుతోంది. మహారాష్ట్రలో తమ బలం పెరగడంతో శివసేనకు గుడ్ బై చెప్పి మరీ బీజేపీ పోటీ చేసింది.
భవిష్యత్తులో తెలుగుదేశానికి అలాంటి పరిస్థితి ఎదురు కావొచ్చుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనులు, ఆయన హవా కారణంగా బీజేపీ వైపు చాలామంది నేతలు మొగ్గు చూపుతున్నారు. ఏపీలో కూడా పలువురు నేతలు కమలం వైపు చూస్తున్నారు.
కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల నుండి పలువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా, మాజీ మంత్రి, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పని చేసిన కన్నా లక్ష్మీ నారాయణ మంగళవారం కమల తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు క్యూలో ఉన్నారని అంటున్నారు.
వివిధ కారణాలతో టీడీపీలో చేరలేకపోయే లేదా మోడీ హవాతో బీజేపీలో చేరాలనుకునే నేతలు ఏపీలో ముందుముందు మరింతమంది ఉంటారని అంటున్నారు. ఎన్నికలకు ముందు రాయపాటి సాంబశివ రావు టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లాలో రాయపాటి, కన్నాల మధ్య వైరం ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కన్నా బీజేపీలో చేరారు. మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి కూడా ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.
ఇలా పలు కారణాలతో ఏపీలో బీజేపీలోకి చేరికలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది టీడీపీకి, చంద్రబాబుకు ఇబ్బందికర పరిణామమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు, 2019 నాటికి తెలంగాణ రాష్ట్రంలో మిగతా పార్టీలను తోసిరాజని అధికార పార్టీకి ధీటుగా ఎదగాలని బీజేపీ పావులు కదుపుతోంది.
మోడీ సేవకు ఆకర్షితుడనయ్యా: కన్నా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిస్వార్థ సేవకు ఆకర్షితుడినయ్యే భారతీయ జనతా పార్టీలో చేరానని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ ఢిల్లీలో చెప్పారు. రామ్ మాధవ్ సమక్షంలో అమిత్ షాను కలిశానని ఢిల్లీలో కన్నా మీడియాకు తెలిపారు.
త్వరలో రాష్ట్ర నేత హరిబాబు సమక్షంలో అధికారికంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటానని కన్నా వెల్లడించారు. తన సహచరులు ఇంకొందరు కూడా పార్టీలో చేరతారని వివరించారు. కాంగ్రెస్ విధానాలతో కొంత అసంతృప్తిగా ఉన్నమాట నిజమేనని... నమ్మినబంటుగా, నమ్మశక్యమైన నేతగా బీజేపీలో పనిచేస్తానని కన్నా చెప్పారు.