బిజెపి ఎమ్మెల్యేను ఎత్తుకొచ్చి బయటపడేశారు
న్యూఢిల్లీ: రెండో రోజు కొనసాగిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు గందరగోళంగా మారాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మేల్యేలు పలు అంశాలను లేవనెత్తి ఆందోళనకు దిగారు. సభలో ఉన్నది ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలే అయినా.. అధికార పక్షానికి చుక్కలు చూపించారు.
దీంతో చేసేదేం లేక మార్షల్స్ను రంగంలోకి దించి బిజెపి ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను అధికార పక్షం అసెంబ్లీ నుంచి బయటికి తోసేసింది. తొలుత మర్యాదగా బయటికి రావాలని ఆయనను బతిమాలినా వినకపోవడంతో.. ఐదారుగురు మార్షల్స్ ఆయనను ఎత్తుకుని వచ్చి బయట దించేశారు.
కాగా, అంతకుముందు విజేందర్ గుప్తా అరుపులను ఉద్దేశించి.. స్పీకర్ మాట్లాడుతూ అతనికి ఓ విక్స్ బిల్ల ఇవ్వాలని ఛలోక్తులు విసిరారు. దీంతో సభ్యులంతా పెద్దగా నవ్వుతూ బల్లలు చరిచారు.
మంగళవారం జరిగిన తొలి రోజు సమావేశాల్లో నకిలీ డిగ్రీని కలిగి ఉండి జైలుపాలైన మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ విషయంపై విజేందర్ ప్రశ్నించారు. ఆయనకు ఎలాంటి సమాధానం చెప్పకుండానే సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టి అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కాగా, రెండో రోజు బుధవారంనాటి సమావేశంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించే అంశంపై చర్చ జరగాలని విజేందర్ గుప్తా పట్టుబట్టారు. మిగితా సభా వ్యవహారాలు జరగకుండా అడ్డుకున్నారు. చర్చ జరిగే వరకు ఏ అంశంపై చర్చ అక్కర్లేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ సూచనల మేరకు గుప్తాను మార్షల్స్ ఎత్తుకొచ్చి బయటికి పంపించేశారు.
అనంతరం విజేందర్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆప్ నేతలు తమపై దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాజ్యాంగానికి వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు.