షాక్: యూపీలో ఏకే-47 తుపాకులు అద్దెకు ఇస్తారు
ఘజియాబాద్: బీజేపీ నేత బ్రిజ్ పాల్ తియోతియా హత్య కేసు విచారిస్తున్న పోలీసులు షాక్ కు గురైయ్యే సాక్షాలు సేకరించారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఏకే-47 ఆయుధాలు అద్దెకు ఇస్తున్నారని ఆధారాలు సేకరించారు.
స్థానిక బీజేపీ నాయకుడు బ్రిజ్ పాల్ తియోతియాను ఏకే-47 అత్యాధునిక తుపాకితో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ లో ఏకే-47 ఆయుధాలు అద్దెకు ఇస్తున్నారని గుర్తించారు. రూ. రెండు నుంచి రూ. మూడు లక్షలు డిపాజిట్ చేసుకుని స్థానిక గ్యాంగులకు ఏకే-47 తుపాకీలు అద్దెకు ఇస్తున్నారు.
స్థానిక గ్యాంగులు ఆ దందా చేస్తున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. అద్దెకు తీసుకున్న తుపాకీ తిరిగి ఇచ్చే సమయంలో రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు మినహాయించుకుని మిగిలిన డిపాజిట్ తిరిగిస్తారని వెలుగు చూసింది.
అయితే తుపాకి పోగొడితే ఆ డిపాజిట్ తిరిగి ఇవ్వరు. ఢిల్లీ సరిహద్దులోని ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతాల్లో కొన్ని గ్యాంగులు హత్యలకు సబ్ కాంట్రాక్టులు ఇస్తున్నారు.
అదే విధంగా అత్యాధునిక ఆయుధాలు అద్దెకు ఇస్తున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. కొందరు ముఠా నాయకులు, కరుడుకట్టిన నేరస్తులు జైల్లో నుంచే ఏకే-47 తుపాకీలు అద్దెకు ఇస్తూ వ్యాపారం చేస్తున్నారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.