రాహుల్ గాంధీ రైజింగ్ స్టార్: బీజేపీ నేత సిన్హా
న్యూఢిల్లీ/పాట్నా: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత శత్రుఘ్న సిన్హా సొంత పార్టీ నాయకులకు మరో సారి షాక్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీ రైజింగ్ స్టార్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో బీహార్ లోని మహాకూటమి నేతలు నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లను ప్రశంసలతో ముంచెత్తారు. బీహార్ లో నితీశ్ కుమార్ జీ కొత్త ప్రభుత్వానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
బీహార్ లో మహాకూటమి గెలవడం ప్రజాస్వామ్య విజయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, రైజింగ్ స్టార్ రాహుల్ గాంధీ సమిష్టి కృషి వలనే బీహార్ లో మహాకూటమి విజయం సాధించిందని చెప్పారు.
ఈ విషయాలను శుక్రవారం శత్రుఘ్న సిన్హా ట్విట్ చేస్తూ బీజేపీ నాయకులను ఉక్కిరిబిక్కరి చేశారు. నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో సిన్హా ఈ విధంగా స్పందించడంతో సొంత పార్టీ నాయకులు షాక్ కు గురైనారు. బీహార్ ఎన్నికల ప్రచారానికి శత్రుఘ్న సిన్హాను దూరం పెట్టినప్పటి నుంచి ఆయన సొంత పార్టీ నాయకుల మీద షటైర్లు వేస్తున్నారు.