దారుణం: పట్టపగలే బీజేపీ నేత కాల్చి వేత
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లోహర్దాగాకి చెందిన బీజేపీ నేత పంకజ్ గుప్తాని గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాంచీలోని ఓ రైల్వే స్టేషన్లో కాల్చిచంపారు.
వివరాల్లోకెళితే... పిస్కా రైల్వే స్టేషన్ వద్ద దుండగులు పంకజ్ తలపై కాల్చడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. బాధితుడు రైలు నుంచి కిందికి దిగీదిగగానే దుండగులు అతడ్ని కాల్చి చంపారు. స్టేషన్ వద్ద ఉన్న రామ్లాల్ స్వీట్స్కి సమీపంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది.

ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటన అనంతరం స్టేషన్కి సమీపంలోని రహదారులను స్థానికులు, ఆందోళనకారులు దిగ్బంధించారు. పట్టపగలే ఇలాంటి దారుణం జరగడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, నిందితుల కోసం అన్వేషిస్తున్నామని, వారిని పట్టుకుని తీరుతామని పోలీసులు వెల్లడించారు. కాగా, పిస్కాలో గుప్తా ఓ భూమిని కొన్నట్లు తెలిసింది. అక్కడ నిర్మాణం కోసం అతడు తరచూ అక్కడికి వచ్చివెళ్లేవారు.
భూతగాదాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చనే కోణంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై తీవ్ర నిరసన తెలిపిన బీజేపీ.. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications