నాపై వివక్ష చూపుతారా?: ఢిల్లీ బీజేపీపై అధిష్టానానికి షాజియా ఇల్మీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సొంత పార్టీ నేతలే తలనొప్పిగా మారుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ)ని వీడి బీజేపీలోని చేరిన షాజియా ఇల్మీ మరోసారి సొంత పార్టీపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ఢిల్లీ విభాగంలో సీనియర్ నేతలు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
ఢిల్లీ బీజేపీపైనే..
తమకు అనుకూలంగా ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని షాజియా ఇల్మీ అన్నారు.
తన అసంతృప్తంతా ఢిల్లీలోని బీజేపీ నేతలు, అధికారులపైనేనని.. జాతీయ నాయకత్వం ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు. బీజేపీ అధిష్టానం దీనిపై సరైన చర్యలు తీసుకుంంటుందని భావిస్తున్నానని.. ఇప్పుడు పరిస్థితి బాగుందని అన్నారు. ఇప్పుడు తాను సంతృప్తిగా ఉన్నానని చెప్పారు.
విభేదాలు తొలిసారి కాదంటూ..
ఢిల్లీ విభాగం పార్టీలో విభేదాలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదని, చాలా సార్లు బయటపడ్డాయని అన్నారు. ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న షాజియా ఇల్మీ.. పార్టీ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే.
ప్రధాని మోడీ సభా వేదికపైకి అనుమతించలేదంటూ..
అయితే, ప్రధాని నరేంద్ర మోడీ వేదికపై ఉన్న సమయంలో తనను కొందరు నేతలు వేదికపైకి వెళ్లేందుకు అనుమతించలేదని షాజియా ఇల్మీ ఆరోపిస్తున్నారు. ప్రధాన వేదికపైకి ఢిల్లీ బీజేపీ నేతలను అనుమతించినప్పటికీ.. ఆమె మాత్రం మీడియా ఎన్క్లోజర్ వద్ద కూర్చున్నారు.
ఆఫీస్ బేరర్లపనే..
ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీ సందర్భంగా ఇల్మీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, ఆ తర్వాత ఢిల్లీ బీజేపీ అధికారిక వాట్సప్ గ్రూప్లో తన అసంతృప్తిని తెలియజేశారు. ప్రధాన వేదికపైకి ఢిల్లీ యూనిట్కు చెందిన ఇతర నేతలను అనుమతిచ్చినప్పుడు తనకు మాత్రం ఆఫీస్ బేరర్లు పాస్ ఇవ్వకపోవడంపై ఆమె అవమానంగా భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షాజియా ఇల్మీ తన అసంతృప్తిని బీజేపీ అధిష్టానానికి తెలియజేసింది.