ఇక.. ఈ జన్మలో ఆయన ప్రధానమంత్రి కాలేడు??
జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీయే నుంచి జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) వైదొలగిన తర్వాత ఆ పార్టీకి రెండు రాష్ట్రాల్లో ఊహించని షాక్లు తగిలాయి. అరుణాల్ప్రదేశ్లో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే బీజేపీలో చేరగా, తాజాగా మణిపూర్లో ఉన్న ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు కమలం తీర్థం పుచ్చుకున్నారు. వారిని డబ్బులు పెట్టి కొనుగోలు చేశారంటూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జాతీయ రాజకీయాల్లో రాణించి ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్న నితీష్ కుమార్ కలలు ఈ జన్మలో నెరవేరవని, ఆయనతోనే జేడీయూ సర్వనాశనమవుతుందని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ జేడీయూను చీల్చడం ఖాయమని, అప్పుడు బీహార్ జేడీయూ ముక్త బీహార్గా మారుతుందని, ఇప్పటికే అరుణాచల్ప్రదేశ్, మణిపూర్ రెండు రాష్ట్రాల్లు జేడీయూ నుంచి ముక్తిని పొందాయన్నారు.
డబ్బు ఉపయోగించి ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకునేంత కర్మ తమ పార్టీకి పట్టలేదని, డబ్బులకు లొంగిపోయేంత బలహీనమైనవారా? మీ ఎమ్మెల్యేలు? అని ప్రశ్నించారు. డబ్బుకు లొంగిపోయేవారైతే అలాంటివారికి మీ పార్టీ టికెట్లు ఎలా ఇచ్చిందన్నారు. కాంగ్రెస్తో చేతులు కలపాలన్న జేడీయూ అధిష్ఠానం ఆలోచన ఆ ఎమ్మెల్యేలకు నచ్చలేదని, అందుకే బీజేపీలో చేరారని సుశీల్ మోడీ చెప్పుకొచ్చారు.