బలపరీక్ష కోసం పావులు: ఆపరేషన్ కమల..కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగిన హోటల్ బీజేపీ నేతల తిష్ట..!
ముంబై: మహారాష్ట్ర మరో కర్ణాటక తరహా రాజకీయాలకు కేంద్రబిందువైంది. కర్ణాటకలో 14 నెలల పాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఆపరేషన్ కమలను మహారాష్ట్రలోనూ ఆరంభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేను శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ కూటమి నుంచి ఆకర్షించడానికి బీజేపీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.
విశ్వాస తీర్మానం నెగ్గాలంటే..
మహారాష్ట్ర అసెంబ్లీలో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 288. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. ప్రస్తుతం బీజేపీ ఖాతాలో ఉన్న స్థానాలు 105. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని కలుపుకొంటే అదనంగా బీజేపీకి 54 స్థానాలు చేతికి అందుతాయి. ఈ రెండూ కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ప్రస్తుతం తమకు 30 మంది శాసన సభ్యులు మద్దతు ఇస్తున్నట్లు చెబుతోంది ఎన్సీపీ. అదే నిజమైతే్ర 135 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టసాధ్యం. కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తున్నప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడం కష్టమే.
ఆ నలుగురి చేతికి ఆపరేషన్ కమల..
ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు ఆపరేషన్ కమలను ఆరంభించిందని అంటున్నారు. శివసేన-ఎన్పీపీ-కాంగ్రెస్ కూటమి నుంచి కనీసం 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ వైపు ఆకర్షితులను చేయడానికి అవసరమైన వ్యూహాలను పన్నిందని అంటున్నారు. ఈ బాధ్యతను పార్టీ సీనియర్ నాయకులు నారాయణ్ రాణే. రాధాకృష్ణ వీఖే పాటిల్, గణేష్ నాయక్, బబన్ రావులకు అప్పగించిందని సమాచారం. మొన్నటిదాకా మిత్రపక్షంగా కొనసాగిన శివసేనను టార్గెట్ గా చేసుకుని, వీలైనంత మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ వైపు మొగ్గు చూపించేలా చేయడమే ఈ నలుగురికి అప్పగించిన టాస్క్ గా చెబుతున్నారు.
క్యాంపు రాజకీయాలతో బిజీ..
ప్రస్తుతం మహారాష్ట్రలో క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో తలమునకలయ్యాయి శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల కూటమి. ప్రస్తుతం 50 మంది శాసన సభ్యులు ఉన్నారని, నలుగురు అందుబాటులో లేరంటూ ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ బాంబు పేల్చారు. ఆ నలుగురు ఏమయ్యారనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు దిలీప్ బంకర్ సహా మరో ముగ్గురు అందుబాటులో లేరని చెబుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య దిలీప్ బంకర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
వెలుగులోకి వచ్చిన దిలీప్..
తాను ప్రస్తుతం నాసిక్ లో ఉన్నానని, తన కుమారుడికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రిలో వైద్య పరీక్షలను చేయిస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రిలో ఉండటం వల్ల తాను పార్టీ నాయకత్వానికి అందుబాటులో రాలేదని వివరణ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను బీజేపీ వైపు మొగ్గు చూపేది లేదని, తన నాయకుడు శరద్ పవార్ మాత్రమేనని అన్నారు. అజిత్ పవార్ ప్రమాణ స్వీకారానికి తాను హాజరయ్యానని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని దిలీప్ బంకర్ స్పష్టం చేశారు. ఎప్పుడైతే అజిత్ పవార్ పార్టీని మోసం చేసి, బీజేపీతో చేతులు కలిపారో.. అప్పుడే ఆయనతో తెగదెంపులు చేసుకున్నానని అన్నారు.
మా వాళ్లకు ఫోన్లు చేస్తున్నారు..
కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు బీజేపీ నేతల నుంచి నిరంతరం ఫోన్లు వస్తున్నాయని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తమ పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలు జేడబ్ల్యూ మ్యారియట్ హోటల్ లో ఉన్నారని, అదే హోటల్ లో బీజేపీ నాయకులు గదులను బుక్ చేసుకున్నారని చెప్పారు. ముంబైలో ఇన్ని హోటళ్లు ఉండగా.. బీజేపీ నాయకులకు తమ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ లోనే దిగాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. తమ మూడు పార్టీల నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరబోరని తేల్చి చెప్పారు.