హిమాచల్ ప్రదేశ్ సీఎం అభ్యర్థిగా జేపీ నడ్డా, రేసులో మరో ముగ్గురు, పాపం ధుమాల్ !
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ. నడ్డా (జగత్ ప్రకాష్ నడ్డా) పేరును పార్టీ అగ్ర నాయకత్వం పరిశీలిస్తోందని సమాచారం.
సీఎం అభ్యర్థి ఓటమి !
హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగినప్రేమ్ కుమార్ ధుమాల్ ఓటమి పాలవడంతో కేంద్ర మంత్రి జేపీ. నడ్డా పేరు తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి రేసులో గతంలో కూడా జేపీ నడ్డా ప్రేమ్ కుమార్ ధుమాల్ తో పోటీ పడ్డారు.
ధుమాల్ మీద మోడీకి నమ్మకం
అయితే గతంలో రెండు సార్లు సీఎంగా వ్యవహరించడంతో పాటు వీరభద్రసింగ్కు దీటైన పోటీ ఇవ్వగలరనే అంచనాతో ప్రేమ్ కుమార్ ధుమాల్ మీద బీజేపీ నాయకత్వం మొగ్గుచూపింది. అయితే ఊహించని విధంగా శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓడిపోయారు.
ప్రధాని మోడీ, అమిత్ షా !
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓటమితో తాజాగా జేపీ నడ్డా అభ్యర్థిత్వం వైపు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఆసక్తి చూపుతున్నారు. అగ్రనేతలతో సాన్నిహిత్యం కూడా జేపీ నడ్డాకు కలిసివస్తుందని భావిస్తున్నారు.
రేసులో మరో ముగ్గురు
జేపీ నడ్డా 1993, 1998, 2007 ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. తరువాత హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక అయిన జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా పని చేస్తున్నారు. జేపీ నడ్డాతో పాటు సీనియర్ నాయకులు అనురాగ్ ఠాకూర్, అనీల్ శర్మా, నరేంద్ర ఠాకూర్ సైతం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.