రూ. 5270 కోట్లు.. బీజేపీకి నాలుగేళ్లలో ఎలక్టోరల్ బాండ్స్: కాంగ్రెస్, టీఎంసీకి ఎన్ని కోట్లంటే?
న్యూఢిల్లీ: గత నాలుగేళ్లలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో భారీగా విరాళాలు అందాయి. 2018-22 మధ్య ఆ పార్టీకి వివిధ కంపెనీల నుంచి దాదాపు రూ. 5,270 కోట్లు అందినట్లు ఎన్నికల కమిషన్ డేటా వెల్లడిస్తోంది.
బీజేపీకి అత్యధికంగా రూ. 5270 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్
కాగా, ఈ నాలుగేళ్ల కాల వ్యవధిలో మొత్తం రూ. 9208 కోట్లు విలువైన ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడు పోయాయి. వాటిలో 57 శాతం(రూ. 5270) బీజేపీ ఖాతాలోకి చేరడం గమనార్హం. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి రూ. 964 కోట్లు విలువైన బాండ్లు లభించాయి. ఇవి అమ్ముడుపోయిన బాండ్లలో 10 శాతానికి సమానం. పశ్చిమబెంగాల్కు చెందిన సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)కి రూ. 767 కోట్ల విలువైన బాండ్లు అందాయి.
బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీలకు గత నాలుగేళ్లలో..
మార్చి 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో రూ. 1,033 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను , 2021లో రూ. 22.38 కోట్లు, 2020లో రూ. 2,555 కోట్లు, 2019లో రూ. 1,450 కోట్లు , 2018 ఆర్థిక సంవత్సరంలో రూ. 210 కోట్ల రసీదులను కూడా బీజేపీ పొందింది .
2022 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ రూ. 253 కోట్లు, 2021లో రూ. 10 కోట్లు, 2020లో రూ. 317 కోట్లు , 2019లో రూ. 383 కోట్లు వచ్చాయి.మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తృణమూల్ కాంగ్రెస్ రూ. 528 కోట్లు, 2021లో రూ. 42 కోట్లు, 2020లో రూ. 100 కోట్లు, 2019లో రూ. 97 కోట్లు అందుకుంది.
ఎలక్టోరల్ బాండ్ల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ
2017లో ప్రవేశపెట్టబడిన, ఎలక్టోరల్ బాండ్లు భారతదేశంలోని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి.. వ్యక్తులు, కంపెనీలు కొనుగోలు చేయగల ఆర్థిక సాధనాలు. ఎలక్టోరల్ బాండ్లు రాజకీయ పార్టీలకు అనామక విరాళాలను అనుమతిస్తాయి కాబట్టి.. వ్యవస్థపై అధికార దుర్వినియోగానికి, అవినీతికి దారితీస్తుందని విమర్శకులు అంటున్నారు.
రాజకీయ పార్టీలకు సంపన్నులు అందించే విరాళాల్లో పారదర్శకత లోపించేందుకు ఇవి కారణమవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ విధానంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిన్నంటిని కలిపి జనవరి నెల చివర్లో సుప్రీంకోర్టు విచారించనుంది.