గుజరాత్ పోరు: పటేళ్ల ఓటే కీలకంసీఎం అభ్యర్థిగా నితిన్ పటేల్?
న్యూఢిల్లీ/ అహ్మదాబాద్: తొలి నుంచి దన్నుగా నిలిచిన పాటిదార్ల మద్దతును తిరిగి కూడగట్టేందుకు కమలనాథులు చివరి క్షణం వరకు ప్రయత్నిస్తున్నారు. పాటిదార్లను విశ్వాసంలోకి తీసుకునేందుకు బీజేపీ ప్రస్తుత నాయకత్వం వైఖరికి భిన్నంగా సీఎం అభ్యర్థిని ఖరారు చేయాలని భావిస్తున్నాయి. ఆ దిశలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగా గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పాటిదార్ల నేతను ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
రాష్ట్రంలో కుల సమీకరణాలు, సమాజంలో శక్తిమంతమైన సామాజిక వర్గంగా పాటిదార్ నాయకుల్లో ప్రస్తుత డిప్యూటీ సీఎం నితిన్ భాయి పటేల్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ద్వారా పూర్తిగా కాకున్నా పటేళ్ల ఓటింగ్ గణనీయంగా చీల్చవచ్చని కమలనాథుల ఎత్తుగా కనిపిస్తున్నది.
గతంలో మోదీ సభలకు పోటెత్తిన ప్రజలు
తొలిదశ పోలింగ్ ఈ నెల తొమ్మిదో తేదీన జరుగుతుంది. దీనికి రెండు రోజుల ముందు ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటలతో ప్రచార ఝరి ముగుస్తుంది. అయితే పటేళ్లకు పట్టున్న ప్రాంతాల్లో బీజేపీ నిర్వహిస్తున్న ర్యాలీలకు మోస్తరు స్పందన మాత్రమే రావడంతో కమలనాథుల్లో భయం పట్టుకున్నట్లు సమాచారం. గతంలో ప్రధాని మోదీ నిర్వహించే బహిరంగ సభలకు భారీగా జనం పోటెత్తేవారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో, 2014 లోక్సభ ఎన్నికల్లో సభలకు జన సందోహం భారీగా ఉండేది. ప్రజల్లో ఆసక్తి భారీగా ఉండేది. కానీ ప్రస్తుత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అదేమీ కనిపించడం లేదు.
కమలనాథులను పటేళ్లను నిర్లక్షం చేశారని ఆరోపణలు
మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పటేళ్ల ఆధిపత్య ప్రాంతాల్లో చురుగ్గా, ఒకింత దూకుడుగానే ప్రచారం చేస్తోంది. బీజేపీ రాజకీయ ప్రత్యర్థులు వేధించారని ప్రచారం గావిస్తున్న పాటిదార్ల నాయకుడు హార్దిక్ పటేల్ సభలకూ పటేళ్లు భారీగానే పోటెత్తుతున్నారు. ఇక బీజేపీ కూడా ఈ దఫా పాటిదార్ల నాయకులు, ఓటర్లను నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎంలు కేశుభాయి పటేల్, ఆనందీబెన్ పటేల్, ప్రస్తుత డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ తదితర నాయకులందరిని ద్వితీయ శ్రేణి నేతలుగానే పరిగణిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ దఫా ఆనందీబెన్ పటేల్, ఆమె అనుయాయులకు టిక్కెట్లు కూడా ఇవ్వలేదు.
డిప్యూటీ సీఎంగా నితిన్ పటేల్ పరిమితం
ఇంతకుముందు గతేడాది ఆనందీబెన్ పటేల్ సీఎంగా వైదొలిగినప్పుడు కూడా ఆ పదవికి నాటి మంత్రి, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ అభ్యర్థిత్వాన్నే బీజేపీ నాయకత్వం పరిశీలించిందన్న వార్తలొచ్చినా చివరి క్షణంలో డిప్యూటీ సీఎంగా పరిమితం అయ్యారు. ఈ ఆరోపణలన్నీ గుజరాత్ రాష్ట్రంలో బీజేపీకి కష్టంగా మారిందన్న విమర్శ ఉంది. రాష్ట్రంలోని ఇతర పరిణామాలన్నీ కమలనాథులకు మరింత కష్టం తెచ్చి పెట్టింది. గుజరాత్ పార్టీ నాయకత్వాన్ని పటేళ్ల చేతుల్లో పెట్టడం ద్వారానే అధికారాన్ని కాపాడుకోగలమని బీజేపీ భావిస్తోంది. పార్టీకి క్రమంగా దూరమైన పటేళ్లను, వారి మద్దతు తిరిగి కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నది.
గోవాలో ఇలా సీఎంగా మనోహర్ పారికర్
తొలిదశ పోలింగ్కు ముందే బీజేపీ సీఎం అభ్యర్థి పేరును ప్రకటించాలని భావిస్తున్న తరుణంలో మొదటి పేరు నితిన్ పటేల్ అభ్యర్థిత్వానికి మొగ్గు లభిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజపుత్రుల మనస్సు చూరగొనేందుకు బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. గత మార్చి ఏప్రిల్ నెలల్లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా సీఎం అభ్యర్థిని ప్రకటించకపోయినా బీజేపీ.. మీడియా సమావేశాల్లో, బహిరంగ సభల్లో మనోహర్ పారికర్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించింది. మెజారిటీ సీట్లు లభిస్తే మనోహర్ పారికర్నే సీఎంగా చేస్తామని హామీ ఇచ్చింది. కానీ మెజారిటీ సీట్లు రాకపోయినా ఇతరుల మద్దతుతో మనోహర్ పారికర్నే సీఎంను చేసింది. గతానుభవాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీజేపీ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ అభ్యర్థిత్వాన్ని సీఎంగా ప్రకటించాలని యోచిస్తున్నట్లు సమాచారం.