కలకలం: బీజేపీ ఎమ్మెల్యే ఇంటిపై కాల్పులు, గ్రనేడ్ విసిరారు
మీరట్: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఇంటిపై కొందరు దుండగులు కాల్పులు జరపడంతోపాటు గ్రైనేడ్ విసిరి పారిపోయారు. సర్ధానా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గురువారం ఉదయం ఒంటిగంట సమయంలో సంగీత్ సోమ్ ఆయన ఇంటికి వచ్చారు. సంగీత్ సోమ్ ఇంట్లోకి వెళ్లిన కొద్ది సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు స్విఫ్ట్ కారులో వచ్చారు. ఆ వెంటనే ఎమ్మెల్యే ఇంటిపై కాల్పులు జరిపారు.
దుండగులు కారులో గేటు ముందు నుంచి ఎమ్మెల్యే ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడున్న భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కారులో నుంచి దిగిన ఓ వ్యక్తి ఎమ్మెల్యే ఇంటిపై గ్రైనేడ్ విసిరి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఎమ్మెల్యే ఇంటి వద్ద మందుగుండ్లు స్వాధీనం చేసుకున్నామని, ఎమ్మెల్యేపై దాడి ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఎస్పీ అఖిలేష్ కుమార్ తెలిపారు.