చావడానికైనా.. చంపడానికైనా సిద్ధం: బిజెపి ఎంపి సాక్షి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దాద్రిలో ఓ ముస్లిం వ్యక్తిని ఆవు మాంసం తిన్నాడనే అనుమానంతో కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై సాక్షిమహరాజ్ మాట్లాడుతూ... ఆవును కాపాడుకోవడానికి తాము చంపడానికైనా, చావడానికైనా సిద్ధమని అన్నారు. గోమాతను ఎవరైనా చంపాలని చూస్తే తాము సహించబోమని ఆయన పేర్కొన్నారు.
అంతేగాకుండా, సమాజ్వాదీ పార్టీ నేత ఆజంఖాన్పైనా సాక్షి మహరాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అజాంఖాన్ పాకిస్థాన్కి చెందినవాడని అన్నారు. ఆజంఖాన్ మంగళవారం దాద్రి బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న నేపథ్యంలో సాక్షి మహరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దాద్రి ఘటనలో మృతి చెందిన ముస్లిం వ్యక్తి కుటుంబానికి ఉత్తరప్రదేశ్ సీఎం రూ.45లక్షలు పరిహారం ప్రకటించడాన్ని తాను తప్పుపట్టడం లేదని సాక్షి మహరాజ్ చెప్పారు.
అయితే రాష్ట్రంలోని ఉన్నావోలో ఇద్దరు అక్కాచెల్లెళ్లను కొందరు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేస్తే.. ఆ కుటుంబానికి ఎలాంటి పరిహారం చెల్లించలేదని మండిపడ్డారు.
మరో బిజెపి ఎంపి ఆదిత్యనాథ్ ఇటీవల మాట్లాడుతూ... గోవధ నిషేధాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కోరారు. గోవధలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఐక్యరాజ్యసమితికి దాద్రి ఘటనపై లేఖ రాసిన సమాజ్ వాది పార్టీకి చెందిన మంత్రిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.