నూతన ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా రాధాకృష్ణన్ - మోదీ ఎంపిక వెనుక..!!
ఎట్టకేలకు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిని ప్రధాని మోదీ ఖరారు చేసారు. దక్షిణాదికి చెందిన నేత కే ఉప రాష్ట్రపతిగా అవకాశం కల్పించారు. తమిళనాడుకు చెందిన చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ ను ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా ఎంపిక చేసారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. గతంలో జార్ఖండ్, తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్ గానూ పని చేసారు. 16 ఏళ్ల వయసులోనే ఆరెస్సెస్ లో చేరి... అంచెలంచెలుగా ఎదిగిన ఆయన రెండు సార్లు ఎంపీగానూ వ్యవహరించారు. ఇప్పుడు ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా ప్రధాని మోదీ ఎంపిక చేసారు.
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ కర్ రాజీనామా తరువాత నూతన ఉప రాష్ట్రపతిగా ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశం పైన అనేక మంది పేర్లు తెర మీదకు వచ్చాయి. అయితే, పూర్తిగా మోదీ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఉప రాష్ట్రపతి పదవి దక్షిణాదికే ఇవ్వాలని మోదీ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా తమిళనాడు కు చెందిన చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ ను ఎంపిక చేసారు. ఈ ఎంపికలో అరెస్సెస్ తో పాటుగా దక్షిణాది సమీకరణం కలిసి వచ్చింది. 1957 అక్టోబర్ 20న జన్మించిన చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయసు లోనే ఆరెస్సెస్ లో చేరారు. సంఘ పరివార్ లో అనేక పదవులు నిర్వహించారు. కోయంబత్తూర్ లో బాంబు పేలుళ్ల తరువాత రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పని చేసారు.

ఇక.. గవర్నర్ గా 2023 నుంచి కొనసాగుతున్నారు. ఫిబ్రవరి 2023 నుండి జూలై 2024 వరకు జార్ఖండ్ గవర్నర్గా మరియు మార్చి 2024 నుండి జూలై 2024 వరకు తెలంగాణ గవర్నర్గా (అదనపు ఛార్జ్) మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా (అదనపు ఛార్జ్) కూడా పని చేసారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. ఈ ఎంపికతో ఆరెస్సెస్ సిఫారసులకు ప్రాధాన్యత ఇస్తూనే.. మారుతున్న సమీకరణాలకు అనుగుణంగా దక్షిణాదికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలను ఢిల్లీ రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నెల 20న ఎన్డీఏ పక్ష సమావేశం జరగనుంది. ఆ వెంటనే రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
అటు ఇండియా కూటమి తమ అభ్యర్ధి ఖరారు పైన కసరత్తు చేస్తోంది. రేపు (సోమవారం) ఇండియా కూటమి సభ్యుల సమావేశం జరగనుంది. కూటమి నుంచి ఎవరిని ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా బరిలోకి దింపాలనేది నిర్ణయించనున్నారు. ఇండియా కూటమి తమ అభ్యర్ధిని పోటీకి దించితే సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది. కాగా, ఎలక్టోలర్ కాలేజ్ లో ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. దీంతో.. ఎన్డీఏ అభ్యర్ధి విజయం సునాయాసంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications