వ్యవసాయ చట్టాలపై కేంద్రం కొత్త వ్యూహం... రైతు ఆందోళనలను కౌంటర్ చేసే క్యాంపెయిన్...
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు ఎంతకీ దిగిరాకపోవడంతో కేంద్రం కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 100 ప్రెస్ మీట్స్,రైతులతో 700 సమావేశాలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా కొత్త చట్టాల వల్ల కలిగే మేలు గురించి రైతు లోకానికి తెలియజేయాలని భావిస్తోంది. ఈ క్యాంపెయిన్లో కేంద్రమంత్రులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఒకరకంగా ఢిల్లీలో రైతుల ఆందోళనకు కౌంటర్గా ఈ క్యాంపెయిన్ని చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
కేంద్రం నిర్వహించబోయే క్యాంపెయిన్లో కొత్త చట్టాలకు సంబంధించి రైతులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్రమంత్రులు వివరణాత్మక సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా కొత్త వ్యవసాయ చట్టాలకు రైతుల నుంచి మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ సాగనుంది.

కాగా,బుధవారం(డిసెంబర్ 9) రైతులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తుండగా రైతు సంఘాలు వాటిని తిరస్కరిస్తున్నాయి. చట్టాల రద్దే తమ ఏకైక ఎజెండా అని మొదటి నుంచి చెప్తున్నాయి. ప్రభుత్వం రైతులను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ... వారు వెనక్కి తగ్గే అవకాశం కనిపించట్లేదు.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులు కార్పోరేట్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని వాపోతున్నారు. క్రమంగా వ్యవసాయాన్ని కార్పోరేట్లు ఆక్రమిస్తారని... ఫలితంగా రైతులు కూలీలుగా మారే ప్రమాదం తలెత్తుందని వాపోతున్నారు. కార్పోరేట్ల నియమ నిబంధనల మేరకు వ్యవసాయం చేస్తే పంట నేలలు కూడా దెబ్బతింటాయని... కాంట్రాక్ట్ వ్యవసాయ పద్దతిలో రైతులకు భద్రత కరువవుతుందని అంటున్నారు.
ఈ చట్టాలతో కార్పోరేట్ల దురాశకు రైతులు బలవుతారని పేర్కొంటూ శుక్రవారం(డిసెంబర్ 11) భారతీయ కిసాన్ యూనియన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు కేంద్ర మాత్రం రైతులు కోరినట్లుగా చట్టంలో కనీస మద్దతు ధరకు సంబంధించి సవరణలు చేస్తామని... రైతులు మళ్లీ చర్చలకు వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. ఇకనైనా రైతులు ఆందోళనలకు స్వస్తి పలికి చర్చలకు వస్తే ప్రభుత్వం ఆహ్వానిస్తుందని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఈ చట్టాలను తీసుకొచ్చేందుకు ఎన్నో చర్చోపచర్చలు జరిపామని.. రైతుల జీవితాల్లో మార్పు కోసమే వీటిని తీసుకొచ్చామని అన్నారు. అటు రైతులు,ఇటు కేంద్రం ఎవరూ మెట్టు దిగకపోవడంతో చివరకు ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందోనన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications