ఎన్నికలంటే భయం: కేజ్రీవాల్, సిద్ధంగా ఉన్నాం:వెంకయ్య
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. బీజేపీకి కొంచమైనా సిగ్గు ఉంటే ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ తీరు వల్ల ఢిల్లీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
ఢిల్లీలో నీటి, విద్యుత్ సమస్య తీవ్ర స్ధాయిలో ఉందని అన్నారు. అందుకే ఢిల్లీలో ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ భయపడుతుందని ఆయన అన్నారు. దీనితో పాటు అక్రమ సంపాదనను స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్ల కుబేరులందరి పేర్లను వెల్లడించాలన్నారు.
విడతలవారీగా ఎంపిక చేసిన పేర్లను మాత్రమే వెల్లడించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంగళవారం ఆయన ఆరోపించారు. అసలు ముగ్గురి పేర్లను మాత్రమే ఎలా వెల్లడిస్తారంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. అక్రమార్కులందరి పేర్లను వెల్లడించడంతో పాటు దోషులుగా తేలిన వారిపై నిర్ణీత సమయంలోగా శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా బీజేపీ సిద్ధం: వెంకయ్య నాయుడు
గెలుస్తామని బీజేపీకి నమ్మకముంటే గత ఐదు నెలల్లో ఎన్నికలకు వెళ్లి ఉండేది అని అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఢిల్లీలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా బీజేపీ సంసిద్ధంగా ఉందన్నారు.
ఢిల్లీలో రాజకీయ బేరసారాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని అన్నారు. ఎన్నికలంటే బీజేపీకి భయం లేదన్నారు. ఢిల్లీలో ఎన్నికలు నిర్వహిస్తే తమ పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఉందని వెంకయ్య నాయుడు అన్నారు.
ఢిల్లీలో ఇంకెంతకాలం రాష్ట్రపతి పాలన కొనసాగిస్తారు?: సుప్రీం కోర్టు
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగింపుపై సుప్రీం కోర్టు స్పందించింది. ఢిల్లీలో ఇంకెంతకాలం రాష్ట్రపతి పాలన కొనసాగిస్తారని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ సభ్యులున్న పార్టీకి రాష్ట్రపతి ఆహ్వానం పంపించారు. రాష్ట్రపతి అభిప్రాయాన్ని కేంద్ర సుప్రీం కోర్టుకు తెలిపింది. మరికాసేపట్లో సుప్రీం ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటు లేదా ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. 2013లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ కూడా పూర్తిస్థాయి మెజార్టీ దక్కించుకోలేక పోయింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలు ఏ పార్టీకి రాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ 31, ఆమ్ఆద్మీ పార్టీకి 28, కాంగ్రెస్కు 8, జేడీయూకు ఒక స్థానం లభించింది.
సింగల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్ మద్దతుతో ఆప్ పార్టీ అధినేత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. 49 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన కేజ్రీవాల్ జనలోక్పాల్ బిల్లుకు బీజేపీ, కాంగ్రెస్ సహకరించలేదంటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో గత ఎనిమిది నెలల నుంచి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.