ఆ తీర్పు తర్వాత తొలిసారిగా అయోధ్యకు నడ్డా... యూపీ పై ఫోకస్, ఏం జరుగుతోంది..?
రామజన్మభూమి కేసుపై 2019లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన తర్వాత తొలిసారిగా అయోధ్యలో పర్యటించనున్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. జేపీ నడ్డాతో పాటుగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు కూడా అయోధ్యలో కలియతిరగనున్నారు. ఇక ఉత్తర్ ప్రదేశ్లో ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎ్ననికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంపై ఫోకస్ చేశాయి.
కాశీ విశ్వనాథ్ ధామ్ ఫేజ్-1 ప్రారంబోత్సవం సందర్భంగా జేపీ నడ్డా ఆదివారమే వారణాసికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఆ రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేశారు. పలువురు ముఖ్యనేతలతో సమావేశమైనట్లు సమాచారం. ఇక జేపీ నడ్డా జాతీయాధ్యక్షుడిగా 2020 జనవరిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు లభించాయి. అయితే వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆయనకు కీలకంగా మారడమే కాకుండా వీటిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటి నుంచే వ్యూహాలు రచించడంతో పాటు పావులు కదుపుతున్నారు. ఇతర పార్టీల నుంచి నాయకులను తమవైపు తిప్పుకునేలా ఆపరేషన్ ప్రారంభించినట్లు సమాచారం. ఇక అసంతృప్తులను కూడా కలుపుకుని పోవాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్కు సూచించినట్లు తెలుస్తోంది.

ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను ప్రారంభించారు. మోదీ నాయకత్వంలో తీసుకువచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు. అయోధ్య విజయం బీజేపీ విజయంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. జేపీ నడ్డా గతేడాది బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. కొన్ని చిన్న రాష్ట్రాల్లో అధికారం చేపట్టింది.
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం ఉందనగానే వారణాసి కాశీవిశ్వనాథ్ ధామ్ కారిడార్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది ఫేజ్-1గా ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే వచ్చే నెలలోనే ఫేజ్ -2 కారిడార్ను కూడా ప్రారంభించి బీజేపీ మైలేజ్ను పొందాలని భావిస్తోంది. ఇక ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో రెండు రోజుల పాటు పర్యటించారు. అతి సామాన్యుడివలే రైల్వే స్టేషన్లో, ప్రధాన రహదారులపై కలియతిరిగారు. అక్కడ వ్యాపారస్తులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీ దుకాణంలో టీ తాగుతూ కెమెరాలకు చిక్కారు. ఇదిలా ఉంటే మోదీ ఎలక్షన్ స్టంట్ ప్రారంభించారని ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి.
మొత్తానికి మోదీ వారణాసి షో గ్రాండ్ సక్సెస్ అయ్యిందని బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకోవడంతో పాటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకుని తిరిగి అధికారం చేపడతామనే బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికే చాలామటుకు ప్రధాన సర్వేలు యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ తిరిగి అధికారం చేపడుతుందని చెబుతున్నాయి. అయితే సర్వేలతో తమకు పనిలేదని ఇటు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్లు చెబుతున్నాయి. ఇంకా సమయం ఉన్నందున లెక్కలు ఎలాగైనా మారే అవకాశాలున్నాయని చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications