శివసేనతో చర్చలు జరుపుతాం..కానీ కండీషన్స్ అప్లై: బీజేపీ
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు డెడ్ లైన్ దగ్గర పడుతోంది. మరో మూడు రోజుల సమయంలో అక్కడి అసెంబ్లీ గడువు ముగియనుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ 9కల్లా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ బీజేపీ శివసేన పార్టీల మధ్య పెరిగిన దూరంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటు కష్టంగానే కనిపిస్తోంది. ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక లాభం లేదనుకున్న బీజేపీ ఓ మెట్టు దిగి శివసేనతో చర్చలు జరిపేందుకు సిద్ధం అని మంగళవారం ప్రకటించింది.
సీఎం పదవి పై తేల్చేవరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాదు: శివసేన
ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో బీజేపీ ఓ మెట్టు దిగింది. ముఖ్యమంత్రి పీఠంపై పట్టువీడని శివసేన పార్టీతో చర్చలు జరిపేందుకు సిద్ధం అని ప్రకటించింది. ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడి రెండు వారాలు సమయం అయినందున అక్కడ కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు. అయితే రెండు పార్టీల మధ్య తలెత్తిన విబేధాలను పరిష్కరించుకోవడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా సీఎం పోస్టును కూడా చెరో రెండున్నరేళ్లు ఉండాలన్న శివసేన డిమాండ్కు బీజేపీ ఒప్పుకోకపోవడంతో శివసేన కూడా తన దారులను వెతుక్కుంటోంది.
ఇక ఎన్సీపీ కాంగ్రెస్ల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని శివసేన చెబుతుండటంతో బీజేపీ ఆ పార్టీతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఇక్కడ కూడా సీఎం పోస్టుపై బీజేపీ క్లారిటీ ఇవ్వలేదు. ఇక సీఎం పోస్టుపై లిఖితపూర్వకంగా బీజేపీ ఏమీ ఇవ్వదని స్పష్టం చేశారు దేవేంద్ర ఫడ్నవీస్ సన్నిహితుడు గిరీష్ మహాజన్. శివసేన, బీజేపీలు పొత్తుతో కలిసి పోటీచేశాక ఇప్పుడు శివసేన పార్టీ తమకు సహకరించకపోవడాన్ని తప్పుబట్టారు గిరీష్ మహాజన్.ప్రభుత్వ ఏర్పాటులో జరుగుతున్న జాప్యానికి కారణం శివసేనే అని ఆయన ధ్వజమెత్తారు. మరో రెండురోజుల్లో మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెర పడుతుందని గిరీష్ మహాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు.