అసలైన తుక్డే తుక్డే గ్యాంగ్ బీజేపీ -సైనికులనూ దేశద్రోహులంటారా? -కేంద్రంపై అకాలీ చీఫ్ బాదల్
ప్రశ్నించినవాళ్లపై విచ్ఛిన్నకారులని ముద్రవేయడం.. గొంతు విప్పినవాళ్లను టెర్రరిస్టులుగా చిత్రీకరించడం బీజేపీకి బాగా అలవాటైపోయిందని, అసలు భారతదేశంలో నిజమైన తుక్డే తుక్డే గ్యాంగ్ ఉందటే అది బీజేపీ ఒక్కటేనని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న రైతుల మధ్య కులమతాల చిచ్చుపెట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
రజనీ పార్టీతో కమల్ ఎన్నికల పొత్తు -తోడుగా మజ్లిస్ -ఎంజీఆర్ ఆశిస్సు -డీఎంకే అనూహ్య స్పందన
రైతుల ఆందోళనల నేపథ్యంలో.. సిక్కులకు వ్యతిరేకంగా పంజాబ్ హిందువులను ఏమార్చేందుకు కమలనాథులు కుట్రలు చేస్తున్నారని, పంజాబ్ లో మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని సుఖ్ బీర్ సింగ్ మంగళవారం కామెంట్లు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో దశాబ్దాలపాటు భాగస్వామిగా కొనసాగిన అకాలీదళ్.. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ బయటికి వచ్చేయడం, సుఖ్ బీర్ సతీమణి హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.
తనను వ్యతిరేకించేవాళ్లపై ఎన్ని అభాండాలు వేయడానికైనా బీజేపీ వెనుకాడదని, నిరసనలు చేస్తోన్న రైతులకు సంఘీభావంగా వారి కుటుంబాలకు చెందిన జవాన్లు మద్దతు పలికితే... జవాన్లను కూడా దేశద్రోగులంటూ బీజేపీ వాళ్లు విమర్శిస్తున్నారని, శాంతి ప్రేమికులైన పంజాబీ హిందువులు, సిక్కులు ప్రత్యేకించి రైతుల మధ్య విభేదాలను కల్పించడానికి కాషాయదళం ప్రయత్నిస్తోందని సుఖ్ బీర్ మండిపడ్డారు.
ఢిల్లీ వేదికగా రైతులు జరుపుతోన్న ఆందోళనలు మంగళవారంతో 20వ రోజుకు చేరాయి. ఇప్పటికే కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈవిషయంలో జోక్యం చేసుకుని, చట్టాలని వెనక్కి తీసుకునేలా చేయాలని కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం చట్టాల్ని వెనక్కి తీసుకునేదేలేదని భీష్మించుకుంది. తాజాగా గుజరాత్లోని కచ్లో మంగళవారం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.