నేడు మోడీ బర్త్డే: అనుమతి ఒక్కరికే, ఎవరతడు?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేటితో (సెప్టెంబర్ 17) 66వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. ప్రధాని పదవి చేపట్టాక మోడీ జరుపుకుంటున్న రెండో పుట్టినరోజు ఇది. 1950 సెప్టెంబర్ 17న మోడీ జన్మించారు. ఈరోజు తన 65వ జన్మదినాన్ని ఆయన అత్యంత నిరాడంబరంగా జరుపుకోనున్నారు. గతేడాది ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పుట్టినరోజుని అహ్మదాబాద్లోని తన తల్లి హీరాబెన్ వద్ద ఆశీస్సులు తీసుకుని సాదాసీదాగా జరుపుకున్నారు.
అయితే ఈ ఏడాది కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని బీజేపీ కార్యకర్తలు, దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు ఈరోజు యథావిధిగా రోజువారీ అధికారిక కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఇక మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అధికారిక నివాసంలోకి 'ఒకే ఒక్కరికి' అనుమతి లభించిందంట.
అయితే ఆ వ్యక్తి ఎవరనేది అందరిలో ఆసక్తి నెలకొంది. భద్రతా కారణాల రీత్యా ఆ వ్యక్తి పేరుని వెల్లడించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం నిరాకరించింది. అయితే ఆయన గురించిన వివరాలను మాత్రం వెల్లడించింది. అది 2000వ సంవత్సరం. అప్పటికి మోడీ ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రి కాలేదు.
ఆనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఢిల్లీలోని అశోకా రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ చిన్న గదిలో ఉండేవారు. ఆ ఏడాది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అక్కడ పనిచేసే ఓ వ్యక్తి మోడీ వద్దకు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, నోరు తీపి చేశాడట.
అయితే ఆ వ్యక్తికి ఇచ్చేందుకు మోడీ వద్ద కేవలం రూ. 2వేలే ఉన్నాయట. దీంతో ‘‘నా వద్ద రూ.2 లే ఉన్నాయి. ఏం కొనివ్వమంటావు?'' అని మోడీ ఆ వ్యక్తిని అడిగారు. ‘‘రాబోయే రోజుల్లో మీరు ఇంకా పెద్ద పదవిలోకి వెళతారు. అప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి చాలు. నాకేమీ ఇవ్వొద్దు' అని బదులిచ్చాడట.
ఆ మరుసటి ఏడాదే గుజరాత్లోని కేశుభాయి పటేల్ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోవడం, 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి ఏడాది (2002)లో మోడీ తన జన్మదినం సందర్భంగా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుని తన ఇంటికి పిలిపించుకుని అతడితో కలిసి భోజనం చేశారంట.
ఆరోజు నుంచి ఈరోజు వరకు ప్రతి ఏడాది ప్రధాని నరేంద్రమోడీ తన పుట్టినరోజు సందర్భంగా ఆతడిని కలుస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా ఆ వ్యక్తికి రేసుకోర్సు రోడ్డులోని ప్రధాని అధికారిక నివాసంలోకి మోడీ ఆహ్వానించారు. ఇక రాజకీయలకు అతీతంగా ఆర్ధికశాఖ మంత్రి అరుణై జైట్లీ మోడీతో చాలా సన్నిహితంగా ఉంటారు.
మోడీ ప్రాణ మిత్రుడు అమిత్ షా గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి ప్రతి పుట్టినరోజు మోడీ వారిద్దరితో గడుపుతారు. ఇది ఇలా ఉంటే మోడీ నియోజకవర్గమైన వారణాసిలో పార్టీ నేతలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.