కోల్కత్తాలో బీజేపీ సభా వేదిక ధ్వంసం ..యోగి బహిరంగ సభ రద్దు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ , తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది . ఇక తాజాగా కోల్ కతాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగసభ రద్దైనట్టు బీజేపీ తెలిపింది. వేదికను ధ్వంసం చేశారని, వేదికను నిర్మించిన వ్యక్తిని కూడా చితకబాదారని తెలిపింది. మరోవైపు, టీఎంసీపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. హింసకు పాల్పడుతూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరో వైపు మమతాబెనర్జీ సైతం బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు .
మే 23న సోనియా ఎన్డీయేతర పక్షాల భేటీకి ఆహ్వానం ..ఫలితాల రోజు భేటీ సక్సెస్ అయ్యేనా ?
నిన్న జరిగిన హింసాత్మక ఘటనలో ఎంతో మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయని మమతా బెనర్జీ పై బీజేపీ చీఫ్ అమిత్ షా నిప్పులు చెరిగారు .తన రోడ్ షో జరిగితే, ఓడిపోతానన్న భయంతోనే మమతా బెనర్జీ తన నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టారని అమిత్ షా ఆరోపించారు. పై నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తూ, బీజేపీ ర్యాలీలోకి జొరబడిన టీఎంసీ కార్యకర్తలు విధ్వంసానికి దిగారని, ఆస్తులను నాశనం చేశారని అన్నారు. తన రోడ్ షోలో మూడు సార్లు టీఎంసీ దాడులు చేసిందని, ఆందోళన చేస్తున్న వారిని అక్కడే ఉన్న పోలీసులు కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని అమిత్ షా ఆరోపించారు.
ఆమె నిజస్వరూపం ఏంటో నిన్న కోల్ కతాలో జరిగిన ఘటనతో బెంగాల్ వాసులకు తెలిసి వచ్చిందని, ఆమెను ప్రజలు తిరస్కరించే రోజు ఎంతో దూరంలో లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు .ఇక తాజాగా మరోమారు బహిరంగ సభను రద్దు చేసుకునే పరిస్థితి వచ్చిందని మమత సర్కార్ ను బర్తరఫ్ చెయ్యాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. యోగి ఆదిత్యనాథ్ బహిరంగసభ రద్దైనట్టు ప్రకటించిన బీజేపీ పశ్చిమ బెంగాల్ లో ప్రజా స్వామ్యం లేదని ఆరోపించారు.