బీజేపీ నేతలు ఎంత పనిచేశారు?: బతికుండగానే సంతాపమా!, ఎందుకిలా?..
వినోద్ ఖన్నా చనిపోయారంటూ వచ్చిన తప్పుడు వార్తల వల్లే మౌనం పాటించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు.
మేఘాలయ: నిజ-నిజాలను ఏమాత్రం బేరీజు వేసుకోకుండా కేవలం సెన్సేషన్ కోసం తాపత్రయపడే క్రమంలో బతికుండగానే మీడియా కొంతమంది నటుల్ని చంపేసింది. గతంలో తెలుగు నటులు వేణు మాధవ్, ఎంఎస్ నారాయణ వంటి హాస్య నటుల విషయంలో ఇలాగే జరగడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
ఇక సోషల్ మీడియాలోను ఇదే తంతు కొనసాగుతోంది. ఏదైనా వార్త కొంచెం లీకైతే చాలు.. వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా.. అదే పనిగా ఊహాగానాలను ప్రచారం చేయడం ఎక్కువైపోయింది. ఇదే క్రమంలో బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాకు సైతం ఈ సెగ తగిలింది.
ఓవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటూ ముంబై గిర్గామ్ లోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చీ సెంటర్ వర్గాలు బులిటెన్ విడుదల చేసినా.. సోషల్ మీడియాలో మాత్రం ఆయన చనిపోయారంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో ఇది నిజమేనని నమ్మిన మేఘాలయ బీజేపీ పార్టీ ఆయనకు నివాళులు సైతం అర్పించడం గమనార్హం.
అయితే ఆ తర్వాత తప్పును గుర్తించిన బీజేపీ అధికారులు జరిగిన దానిపై విచారం వ్యక్తం చేశారు. వినోద్ ఖన్నా చనిపోయారంటూ వచ్చిన తప్పుడు వార్తల వల్లే మౌనం పాటించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. జరిగిన దానికి క్షమాపణలు కోరారు.
ఈ నేపథ్యంలో వినోద్ ఖన్నా కుమారుడు అభిమానులు వదంతులను నమ్మవద్దని ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. కాగా, వినోద్ ఖన్నా ప్రస్తుతం పంజాబ్ లోని గురుదాస్ పూర్ నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.