మహారాష్ట్ర మహాట్విస్ట్! ఎన్నికలకు ముందే బీజేపీ ప్లాన్-బీ సిద్ధం చేసిందా? అసలేం జరిగిందంటే.?
ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్ర రాజకీయాలు అనేక మార్పులు తిరుగుతున్నాయి. మొదట మిత్రపక్షాలైన బీజేపీ, శివసేన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంతా అనుకున్నారు. అయితే, ఫలితాల తర్వాత తమకు కూడా రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రి పదవి కావాలంటూ శివసేన పట్టుబడట్టింది. దీనికి బీజేపీ ఒప్పుకోలేదు.

శివసేనతో కుదరకపోవడంతో..
ఈ క్రమంలో మొదట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ తగిన బలం లేకపోవడంతో ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కూడా ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు. శివసేన డిమాండ్లకు బీజేపీ అంగీకరించకపోవడంతో ఈ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయింది.

రాష్ట్రపతి పాలన దిశగా..
ఈ క్రమంలో గవర్నర్ శివసేనతోపాటు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అయితే, ఇచ్చిన సమయంలో ఈ మూడు పార్టీలు కూడా ముందుకు రాకపోవడంతో గవర్నర్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి పంపారు. కేంద్ర కేబినెట్ ఆమోదం, రాష్ట్రపతి ఆమోదంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.

ప్రభుత్వ ఏర్పాటు ఆ మూడు పార్టీలు..
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ పెద్దలతో సమావేశాలు నిర్వహించారు. మూడు పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. ఉద్ధవ్ థాక్రేను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి, మంత్రి పదవులను పంచుకోవాలని నిర్ణయించాయి. శనివారం గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి ఈ మూడు పార్టీలు.

షాకిచ్చిన బీజేపీ..
అయితే, ఎవరూ ఊహించని విధంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ కొంత మంది ఎమ్మెల్యేలను తనవెంట తీసుకెళ్లి బీజేపీకి మద్దతు ప్రకటించారు. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలముందని దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో శనివారం ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతేగాక, రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. ఈ పరిణామం మహారాష్ట్రలోనేగాక దేశం మొత్తం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు బీజేపీపై దుమ్మెత్తిపోశాయి.

ఎన్నికల ముందే ప్లాన్-బీ రెడీ
అయితే, బీజేపీ ఈ రెండో ప్రణాళికను ఎన్నికలకు ముందే రూపొందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు మద్దతు ఇవ్వకపోతే ఏంటనే విషయంపై బీజేపీ అప్పుడే ఆలోచించి ఈ ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. బీజేపీ పార్టీలో కొందరు శివసేన ఆలోచనను ముందే పసిగట్టి పార్టీ పెద్దలకు చెప్పడంతో ఇందుకు సన్నద్ధమైనట్లు తెలిసింది.

శివసేన కాకుంటే ఎన్సీపీనే ఆప్షన్..
ఎన్నికల్లో ఎన్సీపీ పార్టీ కూడా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉండటంతో.. ఒక వేళ శివసేనతో పొత్తు సాధ్యం కాకపోతే ఆ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పెద్దలు అప్పుడే సమాలోచనలు చేసినట్లు సమాచారం. బీజేపీ అనుకున్నట్లు శివసేన వ్యవహారం ఉండటంతో.. ప్లాన్ బీ అమల్లోకి తీసుకొచ్చింది కాషాయ పార్టీ. ఇందులో భాగంగానే తెరవెనుక కథ నడిపిన బీజేపీ పెద్దలు.. అజిత్ పవార్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఆ రోజు ఏం జరుగుతుందో..?
కాగా, నవంబర్ 30న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బలనిరూపణ ఎదుర్కోవాల్సి ఉంది. బీజేపీకి సొంతంగా 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అజిత్ పవార్ వద్ద ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో స్పష్టంగా తెలియనప్పటికీ.. కేవలం 5-6మంది ఎమ్మెల్యేలే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 49మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని ఎన్సీపీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించి గట్టి భద్రత నుడమ నిఘా నీడలో ఉంచాయి. నవంబర్ 30న మహారాష్ట్రలో బీజేపీ సర్కారు కొనసాగుతుందా? లేదా? అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications