అసదుద్దీన్! హిందుత్వం తీస్కో లేదా పాక్ వెళ్లిపో: సాధ్వీ ప్రాచి ఫైర్
న్యూఢిల్లీ: మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ నేత సాధ్వీ ప్రాచీ కౌంటర్ ఇచ్చారు. ప్రతి మనిషి పుట్టుకతోనే ముస్లీం అని అసద్ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో సాధ్వీ ప్రాచీ హైదరాబాద్ ఎంపీ పైన ఘాటుగా స్పందించారు. భారత్లో పుట్టిన ప్రతి మనిషి హిందువేని, మీ నాన్న ఇక్కడే పుట్టారని, కాబట్టి ఆయన హిందువేనని, కాబట్టి హిందూమతంలోకి మారమని సలహా ఇచ్చారు. అలా కాదంటే పాకిస్తాన్ వెళ్లిపోవాలని చెప్పారు.
కొద్ది రోజుల క్రితం అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతి మనిషీ పుట్టుకతోనే ముస్లీం అని, కానీ వారి తల్లిదండ్రులు ఆ పిల్లలను ఇతర మతంలోకి మార్చుతారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలు ధ్వజమెత్తాయి.
కాగా, ప్రతి హిందూ మహిళ నలుగురేసి పిల్లలను కనాలనే ప్రకటన ద్వారా బీజేపీ పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ సృష్టించిన వివాదం సమసిపోకుండా సాధ్వీ ప్రాచి కూడా అదే ప్రకటన ఇటీవల చేసిన విషయం తెలిసిందే. ప్రతి దంపతుల నుంచి తమకు నలుగురేసి పిల్లలు కావాలని ఆమె అన్నారు.
విశ్వహిందూ పరిషత్ విరాట్ హిందూ పేర ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు. ప్రతి హిందూ మహిళ నుంచి నలుగురు పిల్లలు కావాలని ఆమె అన్నారు. వారిలో ఒకర దేశ సరిహద్దులను కాపాడుతారని, ఒకరిని హిందూ సన్యాసులకు బహుమతిగా ఇవ్వాలని, మూడో సంతానాన్ని విహెచ్పి ఇవ్వాలని, తద్వారా సామాజిక సేవ చేయవచ్చునని, నాలుగో సంతానం భారత సంస్కృతిని పరిరక్షించడానికి పనికి వస్తుందని ఆమె వివరించారు.