సేనకు బిజెపి రాంరాం?: కాంగ్రెస్ తప్ప ఏ పార్టీతోనైనా రెడీ
న్యూఢిల్లీ: రాష్ట్రాభివృద్ధి కోసం కాంగ్రెసు మినహా ఇతర ఏ పార్టీ మద్దతునైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని బిజెపి మంగళవారం తేల్చి చెప్పింది. దుస్థితికి కారణమైన కాంగ్రెసు పార్టీ తప్ప అన్ని పార్టీలను మద్దతును తాము కోరుతున్నామని, మహారాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేయడానికి, ప్రజల ఆకాంక్షల నెరవేర్చడానికి ఈ మద్దతును ఆహ్వానిస్తున్నామని బిజెపి నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ చెప్పారు
ఇటీవలి వరకు మహారాష్ట్ర బిజెపి ఇంచార్జీగా వ్యవహరించిన రూఢీ ప్రకటనను బట్టి కాంగ్రెసు తప్ప ఎన్సీపితో పాటు ఏ పార్టీ మద్దతు ఇచ్చినా తీసుకుంటామనే సంకేతాలను పంపించారు. కాంగ్రెసేతర పార్టీల మద్దతును ఆయన కోరినట్లయింది. మహారాష్ట్ర అభివృద్ధి కోసం తమతో కలిసి రావాలనుకుంటున్న వారంతా ముందుకు రావాలని, వారిని తమతో పాటు నడిపించుకుని వెళ్తామని ఆయన అన్నారు.
శివసేన తన మనసు మార్చుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీన్నిబట్టి శివసేనను వదులుకోవడానికి బిజెపి సిద్ధపడిందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపి గురించి అడిగినప్పుడు ఇప్పటికే ఆపార్టీ బేషరతుగా మద్దతు ప్రకటించిందని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి అనంత్ గీతే రాజీనామా చేసి, మహారాష్ట్రలో శివసేన ప్రతిపక్షంలో కూర్చుంటుందా అని అడిగితే గీతే రాజీనామా గురించి తనకు తెలియదని రూఢీ సమాధానమిచ్చారు.
ఎన్నికలకు ముందు నుంచి శివసేనను తమతో తీసుకుని వెళ్లాలని అనుకున్నామని, ఎన్నికల తర్వాత కూడా అలాగే అనుకున్నామని ఆయన అన్నారు. కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం రేపు బుధవారం శాసనసభలో బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ స్థితిలో బిజెపి ప్రభుత్వానికి ఎన్సీపి మద్దతు ఇచ్చి, శివసేన దూరంగా ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే.