అలా ఏం లేదు.. రజనీకాంత్ వస్తానంటే..: బిజెపి
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ భారతీయ జనతా పార్టీలోకి వస్తానంటే ఘనంగా స్వాగతం పలుకుతామని తమిళనాడు పార్టీ శాఖ అధ్యక్షులు తమిళసలై సౌందరరాజన్ అన్నారు. ఆమె బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రజనీకాంత్ను తాము ఆకర్షించడం లేదని.. అయితే ఆయన బిజెపిలోకి వస్తానంటే మాత్రం ఘన స్వాగతం పలుకుతామని చెప్పారు.
రజనీకాంత్కు బిజెపి చాలా సానుకూలంగా ఉందని, ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఎన్నికల ప్రచార సమయంలో కలిశారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంత్ను ప్రకటించే అవకాశాలున్నాయని వస్తున్న వార్తలపై మీడియా ప్రశ్నించగా.. అదంతా మీడియా సృష్టేనని అన్నారు. తమ పార్టీ అధికారికంగా ప్రకటించిన నిర్ణయం కాదని అన్నారు.
అయితే రజనీకాంత్ తమ పార్టీకి ఎప్పుడూ సన్నిహితుడేనని, ఆయనకు తమ పార్టీ సానుకూలంగా ఉందని సౌందరరాజన్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయనను కలిశారని గుర్తు చేశారు. అటల్ బీహారీ వాజ్పాయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన చేపట్టిన నదుల అనుసంధానం ప్రాజెక్టుకు రజనీకాంత్ రూ. కోటి విరాళం అందజేశారని చెప్పారు. జాతీయ దృక్పథం కలిగిన రజనీకాంత్ను తాము సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపారు.
2016 అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను తమిళనాడుకు ఆహ్వానించామని చెప్పారు. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ తాము 2016 ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు.