విభేదాలకు తెర: మోడీ కొలువులో శివసేన దేశాయ్
ముంబై: శివసేన, బిజెపి మధ్య నెలకొన్న విభేదాలకు శనివారం తెర పడినట్లు తెలుస్తోంది. దీంతో తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్ని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో చేర్చుకోవడానికి శివసేన నాయకత్వం సిఫార్సు చేసినట్లు సమాచారం. ఆదివారంనాడు జరిగే మంత్రి విస్తరణలో నరేంద్ర మోడీ అనిల్ దేశాయ్కు మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయి.
మహారాష్ట్రలో అధికార పంపకంపై ఇరు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర స్థాయిలో చర్చలు కొలిక్కి వచ్చేంత వరకు మోడీ మంత్రివర్గంలో చేరడానికి ఎవరినీ సిఫార్సు చేయకూడదని శివసేన అధినే ఉద్ధవ్ థాకరే నిర్ణయించుకున్నారు. చర్చలు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో తమ వైఖరి మార్చుకున్నామని శివసేన నాయకులు చెబుతున్నారు.
మోడీ మంత్రివర్గంలో చేరడానికి అనిల్ దేశాయ్ పేరును ఉద్ధవ్ థాకరే సూచించినట్లు చెబుతున్నారు. మోడీ మంత్రివర్గంలో చేరడానికి మరో ఎంపి పేరును సాయంత్రంలోగా ఉద్ధవ్ థాకరే నిర్ణయిస్తారని సమాచారం. కేంద్ర మంత్రి పదవుల కోసం ఇద్దరి పేర్లను సూచించానలి ప్రధాని కార్యాలయం గురువారం శివసేన నాయకత్వాన్ని అడిగింది.
అయితే, మహారాష్ట్రలో అధికారం పంచుకోవడంపై బిజెపితో అంగీకారం కుదరకపోవడంతో ఎవరి పేరును కేంద్ర మంత్రివర్గానికి సిఫార్సు చేయకూడదని ఉద్ధవ్ థాకరే తొలుత అనుకున్నారు. మహారాష్ట్రకు సంబంధించిన చర్చలు కొలిక్కి వచ్చాయని, ఈ నెల 12వ తేదీన ఫడ్నవీస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షకు సిద్ధపడేలోగా విభేదాలు సమసిపోయి స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
కాగా, పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో ఉద్ధవ్ థాకరే ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. చర్చల ప్రగతిని ఆయన వారికి వివరించనున్నారు. శివసేనకు మహారాష్ట్రలో 12 మంత్రి పదవులు ఇవ్వడానికి ఫడ్నవీస్ ముందుకు వచ్చారు. అందులో ఐదు కేబినెట్ హోదా కాగా, ఏడు పదవులు సహాయ మంత్రి హోదాకు చెందినవి.