ఓపినియన్ పోల్: 115-125 సీట్లతో గుజరాత్లో మళ్లీ బీజేపీ
భారతీయ జనతా పార్టీకి గత 22ఏళ్లుగా కంచుకోటగా ఉన్న గుజరాత్లో మరోసారి ఆ పార్టీ విజయకేతనం ఎగురవేయనున్నట్లు తెలుస్తోంది. ఇండియాటూడే-ఆక్సిస్ మైఇండియా ఓపినియన్ పోల్స్ ఈ మేరకు వెల్లడించింది.
గాంధీనగర్: భారతీయ జనతా పార్టీకి గత 22ఏళ్లుగా కంచుకోటగా ఉన్న గుజరాత్లో మరోసారి ఆ పార్టీ విజయకేతనం ఎగురవేయనున్నట్లు తెలుస్తోంది. ఇండియాటూడే-ఆక్సిస్ మైఇండియా ఓపినియన్ పోల్స్ ఈ మేరకు వెల్లడించింది.
ఈ సెప్టెంబర్ 15-అక్టోబర్ 15 మధ్య కాలంలో నిర్వహించిన ఈ ఓపినియన్ పోల్స్ ప్రకారం.. గుజరాత్లోని మొత్తం 182 నియోజకవర్గాల్లో బీజేపీ 115-125 సీట్లను తన ఖాతాలో వేసుకోనుంది. ఇక ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ 57-65 సీట్లకే పరిమితం కానుంది. కాగా, 2012లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 60సీట్లు గెల్చుకోవడం గమనార్హం.

ఆక్సిస్ మైఇండియా 18,243మంది నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. 48శాతం మంది బీజేపీకి ఓటు వేస్తామని చెప్పారు. 38శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 32శాతం ఎలక్టోరేట్ ఉండగా, అందులో 10శాతం ముస్లింలు, 6శాతం దళితులు, 16శాతం పటీదార్లు ఉన్నారు.
ఇక బీజేపీ విషయానికొస్తే.. బీజేపీకున్న 67శాతం ఎలక్టోరేట్లో.. 37శాతం ఓబీసీలు, ఎస్టీలు 15శాతం, జనరల్ 15శాతం మంది ఉన్నారు. ఓబీసీ లీడర్ అల్పేస్ ఠాకూర్, దళిత కార్యకర్త జిగ్నేష్ మేవానీలు కాంగ్రెస్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. వీరి రాక కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసివచ్చే అంశంగా పేర్కొంది.
పటీదార్ నాయకుడు హార్ధిక్ పటేల్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే ఆ పార్టీకి మరింతగా ఓటింగ్ పెరగనుంది. అయినా కూడా చాలా మంది ఓటర్లు బీజేపీ పాలననే మళ్లీ కోరుకుంటున్నారని ఈ ఓపీనియన్ పోల్స్ వెల్లడిస్తోంది. కాగా, బీజేపీ సీఎం అభ్యర్థి విజయ్ రూపానికి 34శాతం ప్రజల మద్దతు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి శక్తిసింగ్ గోహిల్ కు 19శాతం ప్రజల మద్దతు లభించింది.












Click it and Unblock the Notifications