బెటర్ లక్ నెక్స్ట్ టైమ్: ఫలించని రెండు దశాబ్దాల నిరీక్షణ : ఢిల్లీలో బీజేపీ చివరి ముఖ్యమంత్రిగా.. !
Recommended Video
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో పాగా వేయడానికి భారతీయ జనతా పార్టీ చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఢిల్లీలో అధికారాన్ని అందుకోవడానికి కమలనాథులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. చివరికి చేదు అనుభవమే ఎదురవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళి.. ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ఆద్మీ పార్టీ అప్రతిహతంగా దూసుకెళ్తోండగా కమలనాథులు ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారు. రెండోస్థానానికే పరిమితం అయ్యారు.
హస్తినలో హ్యాట్రిక్: సర్కార్ సామాన్యుడిదే: ఆమ్ఆద్మీ ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమే..!
అందని హస్తిన..
లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ నేతలు అసెంబ్లీ బరిలో దిగేటప్పటికి చతికిలపడాల్సి వస్తోంది. లోక్సభలో చూపిన మెజారిటీ మార్క్ గానీ, అప్పటి మెరుపులు గానీ తాజా ఫలితాల్లో ప్రదర్శించలేకపోతోంది. ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ నుంచీ ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థులు అగ్రస్థానానికి దూసుకెళ్లారు. అక్కడే కొనసాగుతున్నారు. బీజేపీ రెండోస్థానానికి పరిమితమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కంటే అధిక స్థానాలను దక్కించుకున్న నేపథ్యంలో ఆమ్ఆద్మీ పార్టీ అధికార పగ్గాలను అందుకోవడం దాదాపుగా ఖాయమైంది.
సర్వశక్తులు ఒడ్డినప్పటికీ..
ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో 22 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించడానికి బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. సర్వశక్తులనూ ఒడ్డింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను కమలనాథులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాలు ఈ సారి పునరావృతం కాకుండా చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో.. అన్నీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్నికల బరిలో కనిపించారు. ఇంతా చేసినప్పటికీ.. ఆ ప్రయత్నాలన్నీ దెబ్బకొట్టాయి.
250 మందికి పైగా లోక్సభ సభ్యులతో ప్రచారం..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పెద్ద సంఖ్యలో తమ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులను దింపింది బీజేపీ. మరో 50 మందికి పైగా కేంద్రమంత్రులు దీనికి అదనం. ఏ రాష్ట్ర ప్రజలు అధికంగా ఉండే చోట.. ఆ ప్రాంత ఎంపీలకు.. ఏ రాష్ట్రానికి చెందిన ప్రజలు. అదికంగా నివసించే చోట.. ఆ రాష్ట్రం నుంచి ఎన్నికైన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో ప్రచారాన్ని చేపట్టారు. 50 మందికి పైగా కేంద్రమంత్రులతో ప్రచార బాధ్యతలను అప్పగించారు. హిందుత్వాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు వంటి వివాదాస్పద కార్యక్రమాల గురించి వివరించే ప్రయత్నం చేశారు.
ఇప్పటిదాకా ఢిల్లీ బీజేపీ చివరి ముఖ్యమంత్రి ఆమే..
ఈ సారి కూడా బీజేపీ పరిస్థితి బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అన్నట్టుగా తయారైంది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో అయిదేళ్ల పాటు నిరీక్షించక తప్పని పరిస్థితి ఎదురైంది. లోక్సభ ఎన్నికల దుమ్ము దులిపినప్పటికీ..అసెంబ్లీ బరిలో చతికిల పడటం ఆనవాయితీగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది బీజేపీ. ఇప్పటిదాకా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ చివరి ముఖ్యమంత్రిగా కేంద్ర మాజీమంత్రి, దివంగత సుష్మాస్వరాజ్ నిలిచిపోయారు.
1998 తరువాత..
1998లో కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని కోల్పోయిన తరువాత ఇక బీజేపీ కోలుకోలేకపోయింది. కాంగ్రెస్ వరుసగా మూడేళ్లు.. అంటే 15 సంవత్సరాలు పరిపాలన కొనసాగించింది. కాంగ్రెస్ తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ పనిచేశారు. ఆ తరువాత అరవింద్ కేజ్రీవాల్, మధ్యలో కొన్నాళ్ల పాటు రాష్ట్రపతి పాలన, ఆ తరువాత మళ్లీ కేజ్రీవాలే అధికారాన్ని అందుకున్నారు. ఈ సారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండటం కేవలం లాంఛనప్రాయమే.