రాష్ట్రపతి పాలన పేరుతో బీజేపీ బెదిరింపులు: విపక్ష ఎమ్మెల్యేలకు కోట్లు ఎర..!
ముంబై: మిత్రపక్షం భారతీయ జనతాపార్టీతో ఇక తాడో పేడో తేల్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది శివసేన తెగదెంపులు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమౌతోంది. తాజాగా శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు దీనికి సంబంధించిన సంకేతాలను పంపించినట్టయింది. రాష్ట్రపతి పాలన పెడతామంటూ బీజేపీ బెదిరింపు రాజకీయాలకు తెర తీసిందని సంజయ్ రౌత్ ఆరోపించారు. కోట్ల రూపాయలను వెదజల్లి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కుట్ర పన్నిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ- శివసేన వార్: ఎమ్మెల్యేలపై బీజేపీ కన్నేసిందా..? చివరి అస్త్రం అదేనా..?
రాష్ట్రపతి పాలన పేరుతో బెదిరింపులు..
శుక్రవారం ఉదయం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను హోటల్ కు తరలించాల్సిన పరిస్థితిని బీజేపీ కల్పించిందని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులకు కోట్ల రూపాయలను మొత్తాన్ని ఎరగా వేయడానికి వెనుకాడట్లేదని అన్నారు. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే రాష్ట్రపతి పాలనను తీసుకొస్తామని బెదిరిస్తోందని తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టే దమ్మూ, ధైర్యం బీజేపీకి లేవని, అలా చేస్తే తీవ్ర ప్రజాగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందనే భయం బీజేపీకి ఉందని చెప్పారు.
కర్ణాటక రాజకీయాలు ఇక్కడ చెల్లవ్..
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ఆపరేషన్ కమలను చేపట్టిందని గుర్తు చేశారు. వందల కోట్ల రూపాయల ప్రజల డబ్బును వెదజల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసిందని, వారితో రాజీనామా చేయించి ప్రభుత్వ కూలిపోవడానికి కారణమైందని సంజయ్ రౌత్ అన్నారు. అదే తరహా కుట్ర రాజకీయాలను మహారాష్ట్రలో కూడా చేయడానికి పావులు కదుపుతోందని, అలాంటి చర్యలు మహారాష్ట్రలో ఫలించబోవని అన్నారు. కుట్ర రాజకీయాలు చేయడానికి ఇది కర్ణాటక కాదని హెచ్చరించారు.
రిసార్టు, హోటల్ రాజకీయాలకు కారకులెవరు?
మహారాష్ట్రలో రిసార్టు, హోటల్ రాజకీయాలకు కారకులు ఎవరని, దీని వెనుక ఎవరి హస్తం ఉందని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. దీనికంతటికీ కారణం బీజేపీయేనని అన్నారు. అధికారాన్ని అందుకోవడానికి ఎన్ని కోట్ల రూపాయలనైనా మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేయడానికి బీజేపీ వెనుకాడట్లేదని ఆరోపించారు. ఢిల్లీకి చెందిన బీజేపీ పెద్దల ఎత్తులు, పైఎత్తులు, కుట్ర రాజకీయాలు మహారాష్ట్రలో పని చేయబోవని అన్నారు. తాము 50-50 ఫార్ములాకే కట్టుబడి ఉన్నామని, ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల పాటు పంచుకోవాలనే ప్రధాన డిమాండ్ తప్ప మరేదీ తాము బీజేపీకి ప్రతిపాదించలేదని అన్నారు.