రివేంజ్ : దెబ్బకు దెబ్బ తప్పదు.. ఒకరిని చంపితే నలుగురిని.. మమతకు బీజేపీ హెచ్చరిక
పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింస కొనసాగుతూనే ఉంది. తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య కక్షలు,ప్రతీకారాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గురువారం(డిసెంబర్ 10) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై బెంగాల్లో జరిగిన దాడిని ఆ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. దెబ్బకు దెబ్బ తప్పదని మమతా సర్కార్ను హెచ్చరిస్తోంది. ఈ మేరకు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సోషల్ మీడియాలో మమతకు హెచ్చరిక జారీ చేశారు.
మమతా నినాదానికి కౌంటర్గా..
'మేము మారుతాం.. మేము ప్రతీకారం కూడా తీర్చుకుంటాం...' అని తృణమూల్ కాంగ్రెస్ను ఉద్దేశించి దిలీప్ ఘోష్ తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్నారు. 2011లో 'మార్పు అవసరం.. ప్రతీకారం కాదు..' అన్న నినాదంతో మమతా ఎన్నికల్లో ప్రచారం చేయగా... ఆ నినాదానికి కౌంటర్గా దిలీప్ ఘోష్ హెచ్చరిక చేయడం గమనార్హం. జేపీ నడ్డాపై దాడి బెంగాల్లో పూర్తిగా రౌడీ రాజ్యం ఉందనడానికి నిదర్శనమని బీజేపీ విమర్శిస్తోంది. బీజేపీని ఏమీ చేయలేకపోతున్నామన్న ఫ్రస్టేషన్తోనే మమతా దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తోంది.
'ఒక్కరిని చంపితే నలుగురిని చంపుతాం..'
బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత సయంతన్ బసు స్పందిస్తూ మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు ఒక్కరిని చంపితే... మేము నలుగురిని చంపుతామని టీఎంసీ పార్టీని హెచ్చరించారు. ఢిల్లీలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిని కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన పేర్కొనడం గమనార్హం. జేపీ నడ్డాపై దాడికి సంబంధించి పూర్తి నివేదికను సమర్పించాల్సిందిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను కేంద్రం కోరింది.
సెక్యూరిటీ లేకపోవడం వల్లే...
కోల్కతాలోని డైమండ్ హార్బర్కు వెళ్తుండగా జేపీ నడ్డా కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఆ సమయంలో జేపీ నడ్డాతో పాటు,బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా,బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తదితర నేతలు కాన్వాయ్లో ఉన్నారు. బీజేపీ నేతలకు సెక్యూరిటీ లేని కారణంగానే దాడులు జరుగుతున్నాయని దిలీప్ ఘోష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఆరోపణలను ఖండించిన టీఎంసీ...
మరోవైపు బీజేపీ నేతల ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. ఆ పార్టీ నేత మదన్ మిత్రా మాట్లాడుతూ... బీజేపీ సొంత గూండాలే హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ దాడిలో టీఎంసీ ప్రమేయం లేదని తెలిపారు. నడ్డా కాన్వాయ్పై దాడి బీజేపీపై స్థానికుల నిరసనలు, ప్రజల తిరుగుబాటుకు నిదర్శనమని పేర్కొన్నారు. నడ్డా తదితర నేతలు బెంగాల్కు వస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం లేదని... ఉంటే సెక్యూరిటీ కల్పించేవాళ్లమని మరో టీఎంసీ మంత్రి ఫిర్హాద్ హకీమ్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఎంసీ-బీజేపీ మధ్య రాజకీయంగా యుద్ద వాతావరణం నెలకొంది.