'ప్యారాచూట్ సీఎం'పై బీజేపీలో డిష్యూం, దలైలామా ప్రశంస, కేజ్రీ పరుగులని..
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వాడిగా వేడిగా మారాయి. ఓ వైపు ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్, భారతీయ జనతా పార్టీలో చేరి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా వచ్చిన కిరణ్ బేడీ, ఆ పార్టీల మధ్య మాటల యుద్ధం, మరోవైపు బీజేపీలోనే ముఖ్యమంత్రి పీఠం కోసం వర్గపోరు... ఆసక్తికరంగా మారింది.
కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడాన్ని బీజేపీలోని కొందరు జీర్ణించుకోవడం లేదు. బీజేపీ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ మద్దతుదారులు మంగళవారం నాడు పార్టీ కార్యాలయం బయట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాము ప్యారాచూట్ ముఖ్యమంత్రిని సహించేది లేదంటూ కిరణ్ బేడీని ఉద్దేశించి నినాదాలు చేశారు. ఉపాధ్యాయ తన మద్దతుదారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
కిరణ్ బేడీ పైన కమలం ముసలం పుడుతున్న విషయం తెలిసిందే. పార్టీ ఎంపీ మనోజ్ తివారీ సోమవారం తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బుధవారం నాడు బీజేపీ ఢిల్లీ కార్యాలయం ఎదుట ఉన్న కిరణ్ బేడీ ప్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆమె పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కాసేపటికే దీనిని కొంతమంది ధ్వంసం చేశారు.
బీజేపీ, ఏఏపీ వాగ్యుద్ధం.. కాంగ్రెస్ ఔట్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ఏఏపీ, బీజేపీల మధ్యనే పోటా పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు రేసు నుండి తప్పుకున్నట్లుగానే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ, ఏఏపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కిరణ్ బేడీని బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై అభినందనలు తెలిపిన కేజ్రీవాల్.. అదే సమయంలో ఆమెకు సవాల్ చేశారు.
తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆమె కూడా ప్రతిసవాల్ విసిరారు. కిరణ్ బేడీ ఐరన్ లేడీ (Iron Woman)అయితే, అరవింద్ కేజ్రీవాల్ ఐరన్ మ్యాన్ (I-Run Man).. పరుగులు పెట్టే వ్యక్తి అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది.
మరోవైపు బీజేపీలో చేరిన షాజియా ఇల్మీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పైన ప్రశంసలు కురిపించారు. కిరణ్ బేడీ రాక్ అని, ఆమె కచ్చితత్వం గల వ్యక్తి అని, ఆమె నేతృత్వంలో ఢిల్లీ వికసిస్తుందని ఇల్మీ ట్వీట్ చేశారు. తూ హై మేరీ కిరణ్ అంటూ కూడా మరో ట్వీట్ చేశారు.
కిరణ్ బేడీకి దలైలామా ప్రశంస
కిరణ్ బేడీని టిబెట్ అధ్యాత్మిక గురువు దలైలామా ప్రశంసించారు. తీహార్ జైలుకు ఆమె డైరెక్టర్ జనరల్గా ఉన్న సమయంలో ఖైదీలతో ధ్యానం చేయించే సంప్రదాయానికి ఆమె శ్రీకారం చుట్టారన్నారు. ఈ విషయంలో ఆమెను తప్పక అభినందించాలన్నారు. ధ్యానంతో ఏదైనా సాధ్యమన్నారు.